అనంత సస్యశ్యామలమే లక్ష్యం | Modi's role in governance | Sakshi
Sakshi News home page

అనంత సస్యశ్యామలమే లక్ష్యం

May 27 2015 2:24 AM | Updated on Mar 18 2019 9:02 PM

కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.

మోడీ ఏడాది పాలన స్ఫూర్తిదాయకం
కాంగ్రెస్ వాళ్లు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోవడం దురదృష్టం
జనకల్యాణ పర్వ ప్రచార సభలో మంత్రి కామినేని శ్రీనివాస్

 
 అనంతపురం కల్చరల్ : కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కమ్మభవన్ వేదికగా జన కల్యాణ పర్వ ప్రచార సభ జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారధి, ఎన్టీ చౌదరి, సందిరెడ్డి శ్రీనివాసులు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఏడాది పాలనలో ప్రతి వర్గానికి లబ్ధి చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టి అందరికి చేరువయ్యారని కొనియాడారు. దేశ ప్రజలే కాకుండా అనేక దేశ, విదేశ సర్వేలు మోడీ పాలనకు మంచి మార్కులు వేశాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశం భ్రష్టు పట్టిపోయినా ప్రజలు చీత్కరించుకుని డిపాజిట్లు కోల్పోయేలా చేసినా ఇంకా బీజేపీని విమర్శిస్తుండడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

 మహిళలు, వృద్ధులకు, యువతకు, బాలికలకు ఇలా ప్రతి వర్గం సంక్షేమం దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న పలు పథకాలను ప్రజల వద్దకు చేరేలా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో మరే పార్టీకి లేనంత ప్రజాధరణ బీజేపీకి ఉందని అతిపెద్ద పార్టీగా అవతరించడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ అధికారం కోల్పోయిన రఘువీరారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని నవ్యాంధ్ర ప్రదేశ్‌కు బీజేపీ ఎంతగానో సహకరిస్తోందన్నారు.  

 పలువురు పార్టీలో చేరిక
 మంత్రి అనంత పర్యటన సందర్భంగా పలువురు ఆ పార్టీలో చేరారు. హరీష్ రెడ్డి, నాగేంద్ర తదితరులను బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి ఒంటిరిగా అధికారంలోని వద్దామని ఈ సందర్భంగగా పలువురు నేతలు పేర్కొనడం విశేషం.

 కార్యక్రమంలో ఆపార్టీ నేతలు వేంకటేశ్వరరెడ్డి, జగన్మోహన్, సుదాకరరెడ్డి, డాక్టర సోమయాజులు, బిజెవైఎం విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement