తలనొప్పికి తాళలేక వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide in Nellore | Sakshi
Sakshi News home page

తలనొప్పికి తాళలేక వివాహిత ఆత్మహత్య

Oct 15 2017 1:31 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు(క్రైమ్‌):  నగరంలోని పప్పులవీధిలోని సప్తగిరి అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వివాహిత తలనొప్పికి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కే శిరీష(32)కు నెల్లూరుకు చెందిన రాజేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. రాజేష్‌ అనంతపురంలోని ఎస్‌బీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అనంతపురంలో ఉంటూ వారానికోసారి వచ్చి వెళ్తున్నాడు. శిరీషకు తోడుగా రాజేష్‌ తల్లిదండ్రులు ఉంటున్నారు. వివాహమైనప్పటి నుం చి శిరీష తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. మూడ్రోజుల క్రితం శిరీష తల్లిదండ్రులు నెల్లూరుకు రాగా రాజేష్‌ భార్యను సింహపురి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. శుక్రవారం రాత్రి శిరీష తల్లిదండ్రులు ఊరు వెళ్లారు.

శిరీష తన కుమారుడితో కలిసి ఓ బెడ్‌రూమ్‌లో పడుకోగా, మరో బెడ్‌రూమ్‌లో రాజేష్‌ నిద్రపోయాడు. ఆరోగ్యం ఎంతకీ కుదుటపడకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం పనిమనిషి ఇళ్లు ఊడ్చేందుకు బెడ్‌రూమ్‌ తలుపు తట్టగా తెరవలేదు. లోపల శిరీష కుమారుడి ఏడుపులు వినిపిస్తుండటంతో రాజేష్‌ను నిద్రలేపింది. రాజేష్‌ తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా అవి తెరుచుకోలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిచూడగా శిరీషా ఫ్యాన్‌కు శవమై వేలాడుతూ కనిపించింది. దీంతో రెండోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావు, ఎస్సై శ్రీహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిరీష ఆత్మహత్యకు గల కారణాలను భర్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి రెవెన్యూ అధికారులు శవపంచనామా చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement