ఏవోబీలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌లు?

Maoist Action Teams In AOB - Sakshi

సరిహద్దులో ముమ్మరంగా  పోలీస్‌ తనిఖీలు

ముంచంగిపుట్టు(పెదబయలు): ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌లు సంచరిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం అందినట్టు భోగట్టా. మావోయిస్టులు  ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని  ఇంటలి జెన్స్‌ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రం నుంచి   జోలాపుట్టు, కుమడ, డుడుమ మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ వాహనాన్ని ఆపి, బ్యాగులు తనిఖీ చేశారు.అనుమానిత వ్యక్తులను   ప్రశ్నిం చి విడిచిపెట్టారు.

ముంచంగిపుట్టు ఎస్‌ఐ  ప్ర సాదరావు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు నుంచి కుభజంగి జంక్షన్‌ వరుకు బాంబు స్క్వాడ్‌తో కల్వర్టులు,వంతెనల  కింద తనిఖీలు చేశారు. కొన్ని నెలలుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్న నేప«థ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ) వైపు మావో యిస్టులు వచ్చి తలదాచుకుంటున్నారనే  సమాచారంతో  సరిహద్దులో ప్రాంతాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశాయి. దీనికి తోడుగా మావోయిస్టు యాక్షన్‌ టీంలు  సైతం రంగంలోకి దిగినట్టు  పోలీసులు భావించి, సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు  చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే పన్నెడ జంక్షన్, కొత్తాపుట్టు జంక్షన్లలో  పెదబయలు ఎస్‌ఐ రాజారావు  ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top