‘మహీంద్రా’జాలం! | Mahindra and Mahindra seeks Input VAT Subsidy from Andhra Pradesh Government | Sakshi
Sakshi News home page

‘మహీంద్రా’జాలం!

Sep 9 2013 2:18 AM | Updated on Oct 8 2018 7:58 PM

పారిశ్రామిక విధానం 2010-15కు భిన్నంగా 100 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాయితీ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ... ఇప్పుడు ఏకంగా ఇన్‌పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని అడుగుతోంది.

* ఈసారి ఇన్‌పుట్ వ్యాట్ రాయితీ డిమాండ్  

సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విధానం 2010-15కు భిన్నంగా 100 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాయితీ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ... ఇప్పుడు ఏకంగా ఇన్‌పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని అడుగుతోంది. రాష్ట్రం వెలుపల విక్రయించే ట్రాక్టర్లకు కూడా వ్యాట్ రాయితీ కావాలని కోరుతోంది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల తయారీ యూనిట్ కోసం ఈ కంపెనీ రాష్ట్ర పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుంది.

కంపెనీ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. రూ.350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ యూనిట్‌కు 100 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు అనుమతినిస్తూ 2011 మార్చి 23న పరిశ్రమలశాఖ జీవో-26ను జారీ చేసింది. పారిశ్రామిక విధానం 2010-15  కేవలం 50 శాతం వ్యాట్ రాయితీ మాత్రమే ఇవ్వాలి. తాజాగా ఇన్‌పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని మహీంద్రా కంపెనీ కోరుతోంది.

పారిశ్రామిక విధానం 2010-15 మేరకు రాష్ట్రంలో కేవలం అవుట్‌పుట్ ట్యాక్స్ రాయితీ విధానం మాత్రమే అమల్లో ఉంది. వాస్తవానికి ఇన్‌పుట్ ట్యాక్స్‌ను 14.5 శాతం నుంచి 5 శాతానికి ప్రభుత్వం తగ్గించివేసింది. అయితే కంపెనీ... ఈ 5 శాతం ట్యాక్స్‌ను కూడా తిరిగి రాయితీ రూపంలో వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే ట్రాక్టర్లకు కూడా వ్యాట్ రాయితీ ఇవ్వాలని అడుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement