దారులు దారుణం | Lanes brutally | Sakshi
Sakshi News home page

దారులు దారుణం

Dec 26 2013 2:53 AM | Updated on Oct 1 2018 2:00 PM

దారులు దారుణం - Sakshi

దారులు దారుణం

ఫ్యాక్టరీలకు చెరకు సరఫరాకు రైతులు నానా యాతన పడుతున్నారు. రెండేళ్లుగా జిల్లాలో తుఫాన్ల తాకిడికి రోడ్లు దెబ్బతిన్నాయి.

 =చెరకు రైతుకు రహదారుల శాపం
 =తరలింపునకు అడుగడుగునా అవరోధం

 
చోడవరం/కోటవురట్ల, న్యూస్‌లైన్ : ఫ్యాక్టరీలకు చెరకు సరఫరాకు రైతులు నానా యాతన పడుతున్నారు. రెండేళ్లుగా జిల్లాలో తుఫాన్ల తాకిడికి రోడ్లు దెబ్బతిన్నాయి. పొలాల్లో నుంచి చెరకు కాటాలకు వెళ్లే రోడ్లతోపాటు కాటాల నుంచి ఫ్యాక్టరీల వరకు పలు రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా సకాలంలో చెరకు మిల్లులకు సరఫరా కావడం లేదు. జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.

ఈ ఏడాది సుమారు 10 లక్షల టన్నులు క్రషింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. అత్యధికంగా 24వేల మంది సభ్యరైతులు ఉన్న గోవాడ సుగర్ ప్యాక్టరీ 5.30లక్షల టన్నులు క్రషింగ్ చేయాలని యోచిస్తోంది. కానీ దీని పరిధిలోని రాయపురాజుపేట-గోవాడ, గుల్లిపల్లి గ్రామం నుంచి చెరకు కాటా మధ్యలోను, మేడిచర్ల-కొత్తపెంట రోడ్డు, భోగాపురం-పీఎస్‌పేట, జన్నవరం-పీఎస్‌పేట కాటా, జె.నాయుడుపాలెం, రోలుగుంట కాటాలకు వె ళ్లే రోడ్లు, ఒమ్మలి, చినపాచిలి కాటాలకు వచ్చే రోడ్లు దెబ్బతిన్నాయి.

చోడవవరం మండలం లక్ష్మీపురం రైతుల పరిస్థితి మరీ దయనీయం. పెద్ద చెరువు నుంచి బొడ్డేరు వెళ్లే గట్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో చెరకు కట్టలు నెత్తిన పెట్టుకుని సుమారు రెండు కిలోమీటర్ల మేర మోసుకొస్తున్నారు.  ఇలా 300 ఎకరాల్లో పండించిన వెయ్యి టన్నుల చెరకు తరలింపునకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కోటవురట్ల మండలంలో సుమారు 1400 హెక్టార్లలో చెరకు సాగయింది. పందూరు వరాహ నదిలో కాజ్‌వే కొట్టుకుపోవడంతో సుమారు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి ఏటికొప్పాక ఫ్యాక్టరీకి చెరకు తరలించాల్సి వస్తోంది.

అసలే పంటకు గిట్టుబాటు ధర లేక సతమతం అవుతున్న రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో  తరలింపు ఇబ్బందులు అదనపు భారం అవుతున్నాయి. యండపల్లి శివారు వరాహనదిపై వంతెన మరమ్మతులకు గురికావడంతో మాకవరపాలెం, నర్సీపట్నం మండలాలు, కోటవురట్ల మండలం యండపల్లి నుంచి చెరకు సరఫరా ప్రశ్నార్థకంగా ఉంది. కొన్ని చోట్ల రైతులే తాత్కలికంగా మట్టితో పూడ్చి రాకపోకలు సాగిస్తుండగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కొన్ని రోడ్ల మరమ్మతులు చేపట్టింది. చెరకు బళ్ల రద్దీతో అవికూడా పాడయ్యాయి. గవరవరం వద్ద శారద నది గట్టు కొట్టేయడంతో ఆ గట్టుపై నుంచి రావాల్సిన చెరకును తీసుకురావడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement