పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

Kotam Reddy Sridhar Reddy Visit Free Medical Camp - Sakshi

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి   

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.  రూరల్‌ నియోజకవర్గంలోని 17వ డివిజన్‌ ఆకుతోట ఎస్సీవాడలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సొంత నిధులతో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 50 ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అందులోభాగంగా 17వ మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహించామన్నారు. చాలా మంది పేదలు కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారన్నారు. అటువంటి పేదల కోసం ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  వీటితో పాటు వైద్యుల సలహాల మేరకు సర్జరీలు, కంటి అద్దాలు కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిద్దె మురళీకృష్ణయాదవ్, పేనేటి సుధాకర్, పంట్రంగి అజయ్, కల్యాణ్, మీజూరు వినయ్, బట్టా గిరిధర్, చిన్నా, వెంకట కృష్ణ, మీదూరు నారాయణ, పేనేటి రమణయ్య, కటారి రత్నమ్మ, పేనేటి నాగభూషణం పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top