బాబూ.. చేతగాకపోతే గద్దె దిగండి | Is cetagakapote down and proceed .. | Sakshi
Sakshi News home page

బాబూ.. చేతగాకపోతే గద్దె దిగండి

Nov 6 2014 3:24 AM | Updated on Aug 11 2018 4:02 PM

బాబూ.. చేతగాకపోతే గద్దె దిగండి - Sakshi

బాబూ.. చేతగాకపోతే గద్దె దిగండి

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘రైతులు కష్టాల్లో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారు.

 ‘నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించి అధికారంలోకి వచ్చారు. తీరా ఇపుడు బ్యాంకర్లు సహకరించడం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే నెపంతో ఆ హామీలనే మాఫీ చేయూలనుకుంటున్నారు. పేదలనిలా మోసం చేస్తే ఆ పాపం ఊరకేపోదు.. ప్రభుత్వానికి ఉసురు తగిలి తీరుతుంది. చేతగాదని తెలిసీ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పడం క్షమార్షం కాద’ని మహిళలు, రైతులు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం :
 ‘రైతులు కష్టాల్లో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారు. గద్దెనెక్కి ఐదునెలలు దాటుతున్నా రుణమాఫీ చేయలేదు. లేనిపోని సాకులు చెబుతున్నారు. రుణమాఫీ ఇక అమలు కాదని జిల్లా వ్యాప్తంగా ఈ ఐదు నెలల్లో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ సర్కారు హత్యలే.

వీటికి చంద్రబాబే బాధ్యత వహించాల’ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. రైతు, డ్వాక్రా రుణాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏఒక్క హామీని చంద్రబాబు సర్కారు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలతో తహశీల్దార్ కార్యాలయాలు హోరెత్తారుు. రైతులు, మహిళలు, విద్యార్థులు భారీగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు.

సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ధర్నాల అనంతరం అన్నిచోట్ల తహశీల్దార్లకు వినతిపత్రాలను  సమర్పించారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతో సంబంధం లేకుండా అనంతపురం జిల్లాలోని రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని గురునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పడం వల్ల డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యాయని ఆయన విమర్శించారు. రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాను కోల్పోయారన్నారు. బ్యాంకులతో కూడా రైతులు, మహిళలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషా ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాటమీద నిలబడిన వైఎస్ మహానేతగా చరిత్రలో నిలిచిపోతే.. మాట తప్పిన చంద్రబాబు చరిత్రహీనుడయ్యారని చాంద్‌బాషా విమర్శించారు.

పెనుకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలిసి కూడా చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దెక్కారని, ఇప్పడు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 99 అబద్ధాలు ఆడి చంద్రబాబు సీఎం అయితే.. రుణాలు మాఫీ చేయలేనని ఒక్క నిజం చెప్పి వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారని వెంకట్రామిరెడ్డి అన్నారు.

ఇచ్చిన హామీలు నిలుపుకోకపోతే టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రాప్తాడు, అనంతపురం, కనగానపల్లి ధర్నాల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసి తీరుతానని ఢాంబీకాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదంటూ మాట మారుస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి నిలదీశారు. సోషల్ మీడియాలో టీడీపీ మేనిఫెస్టోను కూడా తొలగించారంటే.. ఏస్థాయికి దిగజారుతున్నారో ఇట్టే తెలుస్తోందన్నారు.

హిందూపురం ధర్నాలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలన్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణ చుట్టపుచూపుగా జిల్లాకు రావడం మాని ఇక్కడి కష్టాలను బాబుకు వివరించి.. అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు దద్దమ్మలని, రుణమాఫీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని మండిపడ్డారు.

పుట్టపర్తి ధర్నాలో సమన్వయకర్త సోమశేఖరెడ్డి మాట్లాడుతూ  మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన బాబును చరిత్ర క్షమించదన్నారు. శింగనమలలో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

మహిళలను నమ్మించి మోసం చేసిన బాబుకు మహిళల ఉసురు తగలక తప్పదని ఆమె శాపనార్థాలు పెట్టారు. తాడిపత్రిలో సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మాని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగించి భయానక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. చంద్రబాబు ఎన్నికల హామీలను నిలుపుకోకపోతే ప్రజలు చేతలతో సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. మడకశిరలో సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ మోసం చేయడంలో తనకు తానేసాటి అని చంద్రబాబు నిరూపించుకున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement