‘ఇన్‌స్పైర్’ నిధుల వినియోగంలో అక్రమాలు | Inspire 'improprieties in the use of funds | Sakshi
Sakshi News home page

‘ఇన్‌స్పైర్’ నిధుల వినియోగంలో అక్రమాలు

Aug 14 2013 3:22 AM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రేరణ’ (ఇన్‌స్పైర్) కార్యక్రమానికి అవినీతి చీడ పట్టింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రేరణ’ (ఇన్‌స్పైర్) కార్యక్రమానికి అవినీతి చీడ పట్టింది. ఈ కార్యక్రమం కింద విడుదల చేసిననిధుల ధార.. విద్యార్థుల కోసం కాకుండా ఇతర వ్యవహారాలకు దారి మళ్లింది. ఏకంగా లక్షల రూపాయలు ఇతర అవసరాలకు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ అవినీతిని కట్టడి చేయాల్సిన జిల్లా విద్యాశాఖ మాత్రం ఉపాధ్యాయులకే వంత పాడడం విశేషం.
 
 పాఠశాల విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎంపికయ్యే విద్యార్థికి రూ.5వేల చెక్కు అందిస్తోంది. చెక్కు అందుకున్న విద్యార్థి తన సృజనాత్మకతతో నిర్దేశించిన అంశంపై ఓ నమూనా తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా విద్యార్థులు రూపొందించిన నమూనాలను జిల్లాస్థాయి వైజ్ఞానిక సదస్సులో ప్రదర్శించాల్సి ఉంటుంది. విద్యార్థికిచ్చిన రూ.5వేలలో రూ.2,500 నమునా తయారీకి ఖర్చు చేయగా.. మిగిలిన రూ.2,500లో ప్రయాణ ఖర్చులు, నమూనాకు అవసరమైన వాటికి వినియోగించాలి.
 
 దండిగా నిధులు.. దగాపడ్డ విద్యార్థులు..
 ఈ ఏడాది జిల్లా నుంచి 1,438 మంది విద్యార్థులు ప్రేరణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ప్రభుత్వం రూ.71.9లక్షలు జిల్లా విద్యాశాఖకు విడుదల చేయగా.. వాటిని ఎంపికయిన విద్యార్థులకు చెక్కు రూపంలో పంపిణీ చేశారు. బ్యాంకులనుంచి డ్రా చేసిన నిధులను ఆయా విద్యార్థులు తమ వద్ద కాకుండా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద దాచారు. నిర్దేశిత అంశాలను దృష్టిలో పెట్టుకుని నమూనాలను తయారు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉపాధ్యాయులకిచ్చింది. కానీ జిల్లాలో ఎక్కడా ప్రేరణ కార్యక్రమంపై దృష్టి సారించలేదు. జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ తేదీ దగ్గర పడుతుండడంతో అప్పటికప్పుడు హడావుడిగా విద్యార్థులకు ఉచిత సలహాలిచ్చి ఏదో ఒక నమూనాతో సైన్స్‌ఫెయిర్‌లో హాజరుపర్చారు. దీంతో విద్యార్థుల సృజనాత్మకత ఏమేరకు మెరుగుపడిందో గానీ.. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చుచేయకపోవడంతో ఆ మిగులును ఉపాధ్యాయులే వాడుకున్నారు.
 
 మూడోవంతు డుమ్మా..
 ప్రేరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,438 మంది విద్యార్థులను ఎంపిక చేయగా.. అందులో మూడో వంతు విద్యార్థులు ఎలాంటి నమూనాలు చేయకపోవడం గమనార్హం. గత వారం డివిజన్ల వారీగా వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టగా.. భారీగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. సరూర్‌నగర్ డివిజన్‌లో 449 మంది విద్యార్థులకు కేవలం 230 మంది మాత్రమే ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు నమూనాలతో హాజరయ్యారు. మల్కాజ్‌గిరి డివిజన్‌కు సంబంధించి కుత్బుల్లాపూర్‌లో వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టగా.. 485 మంది విద్యార్థులకు 334 మందే హాజరయ్యారు. అదేవిధంగా వికారాబాద్ డివిజన్‌లో 504 మంది విద్యార్థులకు కేవలం 397 మంది మాత్రమే నమూనాలు చేశారు. మొత్తంగా 477 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనకు దూరమయ్యారు. ఈ లెక్కన రూ.23.85 లక్షలకు లెక్కలేదని స్పష్టమవుతోంది.
 
 మమ.. అనిపించారు
 ప్రేరణ కార్యక్రమంలో భాగంగా భారీగా నిధులు ఇచ్చినప్పటికీ విద్యార్థులు మాత్రం ఆ తరహాలో సృజనాత్మకతకు పదును పెట్టలేకపోయారు. అట్ట డబ్బాలు, థర్మాకోల్ షీట్లతో మొక్కుబడి నమూనాలతో చేతులు దులుపుకొన్నారు. వాస్తవంగా విద్యార్థులు తయారుచేసే నమూనాల ఎంపిక బాధ్యత ఉపాధ్యాయులకున్నప్పటికీ.. వారు బాధ్యతలను విస్మరించారు. దీంతో ఆదరాబాదరగా ఆయా విద్యార్థులు మొక్కుబడిగా నమూనాలు చేసినట్లు పలువురు విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో బహిరంగంగా పేర్కొన్నారు. ప్రేరణ కార్యక్రమంలో చేపట్టే నమునాల్లో థర్మాకోల్ షీట్లు, అట్టపెట్టెలు వాడొద్దనే నిబంధనలున్నప్పటికీ.. ఉపాధ్యాయులు ఆయా విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడంతో ఈ గందరగోళం తలెత్తిందని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 
 వారం రోజుల్లో రికవరీ చేస్తాం
 ప్రేరణలో భాగంగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి హాజరు కాని విద్యార్థులనుంచి నిధులు రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గైర్హాజరైన విద్యార్థుల జాబితా తయారు చేశాం. అదేవిధంగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. వారం రోజుల్లోగా కచ్చితంగా నిధులన్నీ రికవరీ చేస్తాం.
 - సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement