‘రాష్ట్రంలో తొలిసారిగా వినూత్న తరహాలో జిల్లాలో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఈ సభలో ఓటింగ్ ఉన్న వారు మాత్రమే పాల్గొనాలి.
నెల్లూరు(టౌన్), న్యూస్లైన్: ‘రాష్ట్రంలో తొలిసారిగా వినూత్న తరహాలో జిల్లాలో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఈ సభలో ఓటింగ్ ఉన్న వారు మాత్రమే పాల్గొనాలి. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంపై చర్చ జరగాలి. మెజార్టీ ప్రజలు చేతులెత్తి ఆమోదం తెలిపితేనే అభివృద్ధి పనులు మంజూరు చేస్తాం. ఇవన్నీ రికార్డు చేస్తాం. వీడియో, ఫొటోలు కూడా తీస్తాం. ఈ గ్రామ సభలకు మండల స్థాయిలోని ప్రతి శాఖకు చెందిన అధికారి హాజరు కావాలి’ ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన జిల్లా పరిపాలనకు కేంద్రబిందువైన కలెక్టర్ శ్రీకాంత్. అయితే కేవలం రెండు రోజులకే ఇదంతా ఆర్భాటమే అని తేలిపోయింది.
ఆచరణలో హుళక్కే..
జిల్లాలో శనివారం 152 చోట్ల గ్రామసభలను అధికారులు నిర్వహించారు. అన్నింటిలో జనాల హాజరు అతి తక్కువగా ఉండటంతో గ్రామసభలు వెలవెల బోతున్నాయి.
సూళ్లూరుపేట మండలంలో కేవలం ఎంపీడీఓ మాత్రమే హాజరయ్యారు. చాలా సేపటి వరకు ఆయన ప్రజల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత అతి తక్కువగా ప్రజలు హాజరయ్యారు. 17 శాఖలకు గాను నలుగురైదుగురు అధికారులు కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
చిల్లకూరు మండలం చింతవరం అనే గ్రామంలో 1200 వరకు ఓట్లు ఉన్నాయి. మొదట్లో 20 మంది మాత్రమే హాజరయ్యారు. మళ్లీ ప్రజలను బతిమాలడంతో మరో 20 మంది వరకు వచ్చారు.
వాకాడు మండలంలోని కాశీపురంలో జరిగిన గ్రామసభకు మొదటగా వచ్చిన వ్యవసాయ విస్తరణాధికారి గంటల కొద్ది ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత ఎంపీడీవో చొరవతో 50 మంది సభకు హాజరయ్యారు.
పలుచోట్ల అధికారులు హాజరు కాలేదు.
పెళ్లకూరు మండలం కొత్తూరులో సభ జరగకుండా పెత్తందారులైన స్థానిక టీడీపీ, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దళిత సర్పంచ్ తడగల బుజ్జమ్మ గ్రామ సభను నడపడమే వారి దృష్టిలో తప్పైంది. దీంతో ఇక్కడ గ్రామ సభను కొంతసేపు స్థానికులు బహిష్కరించారు.
సమన్వయ లోపం
గ్రామసభలకు అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఒకే రోజు ఐదారు గ్రామాల్లో సభలు నిర్వహిస్తుండటంతో అధికారులు అన్ని ప్రాంతాలకు వెళ్లలేక పోతున్నారు. ఒక గ్రామ సభ జరిగే సమయంలో మరో గ్రామ సభ జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే అధికారులందరూ ప్రతి సభకు హాజరై సభలో తమ శాఖలకు చెందిన విషయాలను ప్రజల ముందించి వారి ఆమోదం పొందవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయపాలనతో పాటు , రాజకీయాలు లేకుండా చూడాలని, సభలో పాల్గొన ని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.