జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా క్యామ మల్లేశ్ నియామకం చెల్లదని ఆ పార్టీ సీనియర్ నేత కేఎం ప్రతాప్ అన్నారు.
డీసీసీ అధ్యక్షుడిని నేనే!
Oct 11 2013 12:58 AM | Updated on Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా క్యామ మల్లేశ్ నియామకం చెల్లదని ఆ పార్టీ సీనియర్ నేత కేఎం ప్రతాప్ అన్నారు. మల్లేశ్ను డీసీసీ ఇన్చార్జి అధ్యక్షుడిగా పీసీసీ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇన్చార్జిల నియామకాలు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతాయని గుర్తు చేశారు. ఏఐసీసీ అనుమతిలేకుండానే మల్లేశ్ పేరును పీసీసీ ఖరారు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు.
అధినాయకత్వం అనుమతి మేరకు పీసీసీ చీఫ్లు ఆయా జిల్లాల కమిటీలను ఖరారు చేస్తారని, రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చే సరికి.. అధిష్టానం ఆమోదం లేకుండానే మల్లేశ్ను నియమించి నట్లు పీసీసీ ఉపాధ్యక్షులు పరస్పర విరుద్ధ ప్రకటనలు జారీ చేసి పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారని అన్నారు. ఇప్పటికీ తానే డీసీసీ సారథినని, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం కూడా తనతోనే ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్గదర్శకాలకు భిన్నంగా డీసీసీ ప్రెసిడెంట్గా మల్లేశ్ ప్రకటించుకుంటే... చట్టప్రకారం చర్యలు చేపడతానని ప్రతాప్ హెచ్చరించారు.
Advertisement


