మచిలీపట్నం వద్ద నిన్న తీరం దాటిన హెలెన్ తుపాను శనివారం అల్పపీడనంగా బలహీనపడింది.
విశాఖ : మచిలీపట్నం వద్ద నిన్న తీరం దాటిన హెలెన్ తుపాను శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని పయనిస్తోంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తుండటంతో తెలంగాణ, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చిరించింది.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు 50వేల కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 2 లక్షల హెక్టార్లలో వరిపంట నీట మునిగింది. 350 ఇళ్లు తుపాను ధాటికి కొట్టుకుపోయాయి.