జిల్లాలోని ఆరోగ్య ఉపకేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది. సొంత భవనాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో
దయనీయస్థితిలో ఆరోగ్య ఉపకేంద్రాలు
Dec 27 2013 3:45 AM | Updated on Sep 2 2017 1:59 AM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్లైన్ :జిల్లాలోని ఆరోగ్య ఉపకేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది. సొంత భవనాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 431 కేంద్రాలుండగా 108 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. వీటిలో 30 కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 323 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అధికారుల అలసత్వం వల్లే ఆరోగ్య ఉపకేంద్రాలు సొంత భవనాలకు నోచుకోలేదనే ఆరోపణలున్నాయి.
అద్దె కేంద్రాల్లో కానరాని నేమ్ బోర్డులు
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సబ్ సెంటర్లు ఎక్కడ ఉన్నయో కూడా తెలియని పరిస్థితి. ప్రతీ సబ్సెంటర్కూ తప్పనిసరిగా నేమ్ బోర్డు ఉండాలి. అయితే అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాల్లో 70 శాతం కేంద్రాలకు బోర్డుల్లేవు. దీంతో సబ్ సెంటర్ ఎక్కడ ఉందో, ఎవరు విధులు నిర్వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇరుకు కేంద్రాలతో అవస్థలు
ఉప కేంద్రాలు నిర్వహిస్తున్న భవనాలు ఇరుకుగా ఉండడంతో వైద్య పరీక్షలకు వస్తున్న గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. సబ్ సెంటర్లో ఉన్న వైద్య పరికరాలు పెట్టడానికి కూడా సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. ఎగ్జామినేషన్ టేబుల్, బరువు తూచే యంత్రం, ఎత్తు కొలిచే పరికరం, మందులు, ఫ్లూయిడ్స్, బీపీ, హెచ్బీ పరికరాలు పెట్టడానికే స్థలం చాలడం లేదని పలు కేంద్రాల్లోని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేంద్రాలు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. ఎంతో విలువైన మందులు, కాటన్, వాడిన సూదులు ఎక్కడబడితే అక్కడే పడేస్తున్నారు.
కలగా మిగిలిన సొంతభవనాలు
ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉంది. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులు, నాయకులను కోరినా ఫలితం లేకపోతోందని అటు ప్రజలు, ఇటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
Advertisement


