అల్‌కాయిదాలోకి ఐఎం కీలక క్యాడర్ | he core cadre of the IM into alkayida | Sakshi
Sakshi News home page

అల్‌కాయిదాలోకి ఐఎం కీలక క్యాడర్

Sep 15 2014 1:03 AM | Updated on Sep 2 2017 1:22 PM

హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)లో విభేదాలు వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

హైదరాబాద్: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)లో విభేదాలు వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీని మాస్టర్‌మైండ్ ఇక్బాల్ భత్కల్‌తో తలెత్తిన వివాదాల నేపథ్యంలో మరో కీలక ఉగ్రవాది మీర్జా సాజిద్ బేగ్ అలియాస్ బడా సాజిద్ అల్‌కాయిదాలో చేరినట్లు కీలక ఆధారాలు సేకరించాయి. భారత్‌తో పాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ‘ఖైదత్-అల్-జిహాద్’ పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరి ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2007లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇక్బాల్ భత్కల్ సైబర్ టైరిజంతో వ్యవస్థల్ని అతలాకుతలం చేయాలని యత్నించాడు.

ప్రస్తుతం ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘడ్‌కు చెందిన బడా సాజిద్ సైతం పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నాడు. ఇక్బాల్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఐఎం నుంచి బయటకు వచ్చిన సాజిద్ ప్రత్యేకంగా మరో గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘ఖైదత్-అల్-జిహాద్’ ఏర్పాటుపై అల్‌జవహరి చేసిన ప్రకటనతో అల్‌కాయిదాలో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతని వెంట అజామ్‌ఘడ్ మాడ్యుల్‌కు చెందిన మరికొందరు ఉగ్రవాదులు అల్‌కాయిదా వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అల్‌కాయిదా కన్ను భారత్‌పై ఉండడం, ఐఎంకు ఇక్కడ పట్టు ఉండటంతో ఈ పరిణామం ఆందోళనకరమని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement