‘హంద్రీ నీవాను పూర్తి చేస్తాం’ | 'Handri fulfill nivanu' | Sakshi
Sakshi News home page

‘హంద్రీ నీవాను పూర్తి చేస్తాం’

Nov 10 2014 3:00 AM | Updated on Sep 26 2018 6:21 PM

హంద్రీనీవాను పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.

గుంతకల్లు : హంద్రీనీవాను పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరిస్తామని  ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం   కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రసాదిని అయిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల హడావుడిగా పూర్తి చేయడంతో అనేక చోట్ల గండ్లు పడుతున్నాయన్నారు.

అనంతపురం జిల్లాపై చంద్రబాబుకు ప్రత్యేక  అభిమానం ఉందని, అందులో భాగంగానే సోలార్‌హబ్, ఫుడ్‌పార్కు, టెక్స్‌టైల్స్‌పార్కు తదితర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపునకు గురికాకుండా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం ఈఓతో పాటు ప్రధాన అర్చకులు వసుధ రాజాచార్యులు డిప్యూటీ సీఎంను సన్మానించారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ కోడెల అపర్ణ, వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement