కోనసీమ లంక ప్రాంతాల్లో తగ్గని వరద
జల దిగ్భంధనంలోనే లంక గ్రామాలు నీటమునిగిన అంతర పంటలు
సాక్షి, తూర్పుగోదావరిః కోనసీమ లంక ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక ప్రాంతాల్లో అంతర పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సఖినేటిపల్లి మండలంలోని పెదలంక, అప్పనరాము లంక, సఖినేటిపల్లి లంక గ్రామాలు.. గత మూడు రోజులుగా జల దిగ్భంధంలోనే చిక్కుకున్నాయి.
కాజ్వేలపై కొనసాగుతున్న వరద ప్రవాహంః
పి.గన్నవరం మండలం అయినవిల్లిలంక, కనాకాయిలంక కాజ్ వేలపై వరదప్రవాహం కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠానేలంక, గురజాపులంకలో కాయగూరల పంటలు నీట మనిగాయి అల్లవరం మండలం బోడసకుర్రులో మూడు రోజులుగా పల్లిపాలెం,జల దిగ్భంధనంలోనే ఉన్నాయి.
నాటు పడవలపైనే రాకపోకలుః
ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో నాటుపడవలపై స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. సఖినేటిపల్లిలో వరద ఉధృతికి అప్పనరాముని లంక,కొత్తలంక గ్రామాలు నీట మునగడంతో అప్పరాముని లంక హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.