అస్వస్థతకు గురై... | Sakshi
Sakshi News home page

అస్వస్థతకు గురై...

Published Wed, Sep 18 2013 3:49 AM

Express is a traveling carriage

కడప అర్బన్, న్యూస్‌లైన్ : చెన్నై నుంచి ముంబైకి వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-7 బోగీలో ప్రయాణిస్తున్న ఎంఎస్ వీణా (32) తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన వీణా తన తండ్రి శేషాద్రి , సోదరుడు బాలాజీతో కలిసి మంగళవారం ఉదయం చెన్నై నుంచి ముంబైకు వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదే రారు. వీరు మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. రే ణిగుంటలో మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు వీణా ఆహారం తీసుకుంది. నందలూరుకు వచ్చే సమయానికి ఊపిరాడక, వాంతులకు గురై అస్వస్థత అయింది.

కడపలోని రైల్వే అధికారులకు సమాచారం రాగా కడపలో 3వ నంబరు ప్లాట్‌ఫారంకు రైలు వచ్చి నిలబడగానే ఎస్-7 బోగీ వద్దకు రైల్వే అధికారులు చేరుకున్నారు. బాధితురాలికి వైద్య సహాయం అందించేందుకు స్ట్రెచర్‌పై బయటకు తీసుకు వచ్చారు. రైల్వే డాక్టర్, 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో రెండు నెలల్లో వీణాకు వివాహం కావాల్సి ఉందని, ఉన్నట్లుండి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మృతురాలి బంధువులు బోరున విలపించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ పీవీ రమణ, సిబ్బంది, ఆర్‌పీఎఫ్ పోలీసులు, అధికారులు బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు స్టేట్‌మెంట్ రికార్డు చేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు.

Advertisement
Advertisement