పిల్లల్లో చైతన్యానికి ‘ఫిట్‌నెస్‌ ఫర్‌ లైఫ్‌’

Cycle Tour For Health Awareness Visakhapatnam - Sakshi

ఏపీ ఎస్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌

విశాఖ చేరుకున్న సైకిల్‌ యాత్ర

అక్కయ్యపాలెం(విశాఖఉత్తర): పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రజల్ని చైతన్యం చేయడానికి రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం( ఏపీ ఎస్‌పీఎఫ్‌) చేపట్టిన సైకిల్‌ యాత్ర శుక్రవారం విశాఖ నగరానికి చేరుకుంది. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంకు చేరుకున్న సైకిల్‌ యాత్రికులకు పోలీస్‌ అధికారులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ మాట్లాడుతూ ‘ఫిట్‌నెస్‌ ఫర్‌ లైఫ్‌’ అనే అంశంపై నేటి తరం పిల్లల్లో చైతన్యం తేవడానికి రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ గత నెల  20న అనంతపురంలో సైకిల్‌ యాత్ర ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 1300 కిలోమీటర్లు ప్రయాణించామని, శనివారం శ్రీకాకుళంలో యాత్ర ముగుస్తుందన్నారు. లైఫ్‌ స్పేన్‌ పెరిగినా, హెల్తీ లైఫ్‌ స్పేన్‌ మాత్రం పెరగలేదన్నారు. చాలా మంది సుగర్, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీతో బాధపడుతున్నారు. వీటివల్ల క్వాలిటీ ఆఫ్‌  లైఫ్‌ గ్రాఫ్‌ పడిపోతోందన్నారు.

అందువల్ల ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని, మెడిసన్స్‌కు దూరంగా, మన సంపదను మనం ఎంజాయ్‌ చేసేలా ఆరోగ్యవంతంగా ఉండాలన్న సంకల్పంతో సైకిల్‌ యాత్ర చేపట్టామన్నారు. రోజుకు 100 కిలోమీటర్లు తొక్కడం పెద్ద కష్టమేమీ కాదు, అడుగడుగునా ప్రజల సహకారంతో చాలా ఆనందంగా యాత్రను ఎంజాయ్‌ చేశామని తెలిపారు. మేము హాల్ట్‌ చేసిన ప్రతి చోటా  స్కూల్‌ పిల్లలు కూడా బాగా స్పందిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ పండుగ స్థానంలో  ఫిట్‌నెట్‌ ఫెస్టివల్స్‌ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రామిరెడ్డి, ఏడీపీసీ కె.ప్రభాకర్, డీపీఆర్‌వో వి.మణిరామ్, నాల్కో జనరల్‌ మేనేజర్‌ పి.కె.పాత్రా, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఎస్‌.సింగ్, పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

40వేల కిలోమీటర్లు  ప్రయాణించా..
నేను ఇంజినీరింగ్‌ పూర్తి చేసి , ప్రైవేటు కళాశాలలో పీటి మాస్టర్‌గా పనిచేస్తున్నాను. అనంతపురం నుంచి సైకిల్‌ యాత్రలో పాల్గొన్నాను. హెల్తీ ఇండియా కాన్సెప్ట్‌తో కర్నూలు  నుంచి భూటాన్,బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్‌Š , శ్రీలంక, కన్యాకుమారి, ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్, నేపాల్‌ దేశాలకు, కర్నూలు నుంచి ఇండియా బోర్డర్‌ అంతా సైకిల్‌పై తిరిగాను. ఇప్పటివరకు సుమారు 40వేల కిలోమీటర్లు సైకిల్‌పై యాత్రలు చేశాను. ఇపుడు హెల్తీ వరల్డ్‌ కాన్సెప్ట్‌తో 54 దేశాలు ఏడాదిన్నర కాలంలో సైకిల్‌పై చుట్టి రావాలని సంకల్పించాను. ప్రపంచ సైకిల్‌ యాత్రకు స్పాన్సర్‌షిప్‌ దొరుకుతుందన్న ఆశతో ఎస్‌పీఎఫ్‌ సైకిల్‌ యాత్రలో పాల్గొన్నాను. చాలా ఆనందంగా ఉంది.– శ్రీకాంత్‌ గోశల, కర్నూలు

ఎన్నో అనుభూతులు
అనంతపురం నుంచి సైకిల్‌ యాత్రలో పాల్గొన్నాను. 14 రోజుల్లో1300 కిలో మీటర్లు యాత్ర పూర్తి చేశాం. అడగడుగునా యాత్రను స్వాదిస్తున్నాం. ఒకే రాష్ట్రం అయినప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలు, సంస్కృతి, వాతావరణం, ఆదరణ ఈ యాత్ర ద్వారా చూడగలిగాం. రాయలసీమలో ఒక వాతావరణం, నెల్లూరులో మరొక విధంగా, తూర్పు గోదావరిలో వేరే వాతావరణం చూశాం. ధవళేశ్వరం ఆనకట్ట హరిద్వార్‌లో ఉన్న అనుభూతి కల్గింది. విశాఖలో వీటన్నింటికి భిన్నమైన అనుభూతి పొందాం. ప్రతి చోట పిల్లల నుంచి మంచి  స్పందన లభించింది.– ఎన్‌. హరిశ్చంద్ర, హెచ్‌సీ, ఎస్‌పీఎఫ్‌ ,అనంతపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top