వేదన.. అరణ్య రోదన | contract Assistant Beat Forest Officers said | Sakshi
Sakshi News home page

వేదన.. అరణ్య రోదన

Mar 30 2017 11:12 AM | Updated on Sep 5 2017 7:30 AM

అటవీశాఖలో 1987లో 280 మంది విలేజ్‌ ఫారెస్ట్‌ వర్కర్లుగా చేరారు.

► కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపని సర్కారు
► అటవీశాఖలో 30 ఏళ్లుగా ఊడిగం
► ఆరంభం నుంచి రూ.7500 జీతంతో బతుకీడుస్తున్న ఏఎఫ్‌బీఓలు
► ఉద్యోగ భద్రత, జీతాల

పెంపు కోసం వేడుకోలు ఎండనక వాననక, అటవీ ప్రాంతంలో క్రూర మృగాల నడుమ పని చేస్తున్నాం. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అయినా మూడు దశాబ్దాలుగా అరకొర జీతాలతోనే బతుకు వెళ్లదీస్తున్నాం. అటవీ శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పని చేస్తున్న      అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల ఆవేదన ఇది. సర్కారు తమను కనికరించి, ఉద్యోగ భద్రతతో పాటు, జీతాలు పెంచి ఆదుకోవాలని ఉద్యోగులు వేడుకొంటున్నారు.  
అర్ధవీడు : అటవీశాఖలో 1987లో 280 మంది విలేజ్‌ ఫారెస్ట్‌ వర్కర్లుగా చేరారు. ప్రభుత్వం 2004లో వీరికి కాంట్రాక్ట్‌ పద్ధతిపై ఏఎఫ్‌బీఓలుగా పదోన్నతి కల్పించి జీతం 7500 ఇస్తోంది. 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కూడా జీతాలు మాత్రం పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎన్‌జిఓ అధ్యక్షులు అశోక్‌బాబు ముఖ్యమంత్రితో చర్చలు జరగపగా ఆయన తమను రెగ్యులర్‌ చేసేందుకు అంగికరించారని, ఇంకోసారి ఆర్థికమంత్రితో చర్చించి రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న చేరిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ రూ.15వేలుపైగా జీతం చెల్లిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం రూ.7500 ఇవ్వడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ జీతాలతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలలో రెగ్యులర్‌ చేశారు.
తమతో పాటు విలేజ్‌ ఫారెస్ట్‌ వర్కర్లుగా చేరిన పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్,  తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు పెంచారని, వారికి అలవెన్సులు అందజేస్తున్నారని ఇక్కడ మా బతుకులు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్‌ చేయడంతో పాటు జీతాలు పెంచి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

కుటుంబ పోషణ భారమైంది
నేను 1987 నుంచి వీఎఫ్‌ఓగా విధుల్లో చేరాను. 2004లో ఏఎఫ్‌బీఓగా కాంట్రాక్టర్‌ పద్ధతిలో తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రూ.7500 జీతంతోనే కుటుంబాలు పోషించుకుంటున్నాం. నిన్న, మొన్న చేరిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 15వేలకు పైగా జీతాలు చెల్లిస్తున్నారు. అందరు ఉద్యోగుల్లాగే మేం కూడా పని చేస్తున్నాం. వివక్ష మాని ఉద్యోగాకు రెగ్యులర్‌ చేయాలి. జిల్లాలో 280 మంది ఇలాంటి పరిస్థితులే అనుభవిస్తున్నారు.             – కిఫాయతుల్ల, ఏఎఫ్‌బీఓ

Advertisement
 
Advertisement
Advertisement