నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తాను : సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Review Meeting Over Spandana Program - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజల నుంచి వస్తున్న వినతి పత్రాలకు రశీదులు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కారించాలని ఆదేశించారు. అర్జీదారులకు ఇచ్చే రశీదుల మీదే సమస్యలు ఫలానా తేదీలోగా పరిష్కారిస్తామని రాసి ఇవ్వాలన్నారు.

అర్జీదారులకు ఇచ్చే రశీదులను కంప్యూటరైజ్‌ చేసి డేటాబేస్‌లో ఉంచాలని ఆదేశించారు. చెప్పిన వ్యవధిలోగా అధికారులు సమస్యలు పరిష్కారిస్తున్నారో లేదో క్రాస్‌ చెక్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు వీటిని పర్యవేక్షిస్తూ.. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశీలిస్తానని తెలిపారు. ప్రతి మంగళవారం అరగంట పాటు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్పందన కార్యక్రమంపై రివ్యూ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని జిలాల్ల నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. (చదవండి: తొలి ‘స్పందన’కు అర్జీల వెల్లువ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top