సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎం | cm behaving as seeamandhra JAC chairman | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎం

Aug 31 2013 1:38 AM | Updated on Mar 28 2018 10:56 AM

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రొళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.

 ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రొళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్వీ మండల శాఖ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపట్ట వివక్షతతో వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో కొనసాగుతున్న కృత్రిమ ఉద్యమాల వెనక పెట్టుబడిదారుల హస్తం ఉందన్నారు.
 
  వ్యాపారాలు, ఆస్తుల రక్షణ కోసమే పెట్టుబడిదారులు సీమాంధ్రలో ఉద్యమాలను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు అబ్బసాని యాదగిరియాదవ్, టీఆర్‌ఎస్వీ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు చాప భాస్కర్, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు అరవింద్, మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ రవీందర్‌యాదవ్, సెక్రెటరీ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
 
 విధులు బహిష్కరించిన న్యాయవాదులు
 అనంతగిరి, న్యూస్‌లైన్: రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదుల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ పిలుపుమేరకు వికారాబాద్‌లో శుక్రవారం లాయర్లు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంపూర్ణ ఆనంద్, మాధవరెడ్డిలు మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలోనూ ఉద్యమం ఉధృతి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగరాజు, జాయింట్ సెక్రెటరీ రమేష్, న్యాయవాదులు నాగేందర్‌గౌడ్, రాంచెందర్‌రావు తదితరులున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement