టీవీ పడి చిన్నారి మృతి | Child Death In Kurnool | Sakshi
Sakshi News home page

టీవీ పడి చిన్నారి మృతి

Aug 15 2018 1:26 PM | Updated on Aug 15 2018 1:26 PM

Child Death In Kurnool - Sakshi

వెంకటసింధు(ఫైల్‌)

పాములపాడులో ఘటన

కర్నూలు, పాములపాడు: టీవీ మీద పడడంతోఓ చిన్నారి మృతిచెందింది. ఈవిషాదకర ఘటన మంగళవారం పాములపాడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పాములపాడుకు చెందిన టైలర్‌ లింగారెడ్డి, అంజలి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నమ్మాయి వెంకటసింధుకు ఏడాదిన్నర వయసు. మంగళవారం ఇంట్లో ఆడుకుంటూ టీవీ తీగలు పట్టుకొని లాగింది. స్టాండ్‌కు ఉన్న చక్రాలు ముందుకు కదలడంతోచిన్నారి తలపై టీవీ పడింది.

ఆ శబ్దం విన్న తల్లి అంజలి పరుగున వచ్చి టీవీ పక్కకు తీసేసి.. పాపను చేతుల్లోకి తీసుకుంది. ఎలాంటి రక్తస్రావం కాలేదు. అయితే.. తలకు వెనుక భాగంలో వాపు వచ్చింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆత్మకూరుకు పంపించారు. అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిత్యం కళ్లముందు వచ్చీరాని మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే పాప ఇక లేదన్న వార్త వారిని కలిచివేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement