ముస్లింలకు రంజాన్‌ తోఫా

Chevireddy Bhaskar Reddy Gift to Muslims Ramadan Festival - Sakshi

10,600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు

ముఖ్యమంత్రి స్ఫూర్తితో అందజేస్తున్నాం : చెవిరెడ్డి

చంద్రగిరి: రంజాన్‌ పండుగ పురస్కరించుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొత్తం పదిరకాల సరుకుల్లో చక్కెర, సేమియా, బాస్మతి, సోనామసూరి బియ్యం, నెయ్యి, రవ్వ, డాల్డా, నూనె ప్యాకెట్‌ మొదలైనవి ఉన్నాయి.  మంగళవారం చంద్రగిరి సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో సామాజిక దూరం పాటిస్తూ రంజాన్‌ తోఫా పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు.

ఆయన ఆలోచనలకు అనుగుణంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ముస్లింలకు రంజాన్‌ కానుక అందించాలని సంకల్పించినట్లు చెప్పారు. ప్రతి ముస్లిం కుటుంబానికి 10 రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా పంచాయతీలకు రంజాన్‌ తోఫా ను వలంటీర్ల ద్వారా వారి ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అల్లా అందరినీ బాగా చూడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండేలా ఆయన ఆశీర్వదించాలంటూ ముస్లింలకు ముందస్తు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా ఐక్యతతో మెలగడం తన నియోజకవర్గ ప్రత్యేకత అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు అండగా ఉండడం తన బాధ్యతని తెలిపారు.

ఆపత్కాలంలో చెవిరెడ్డి సాయం మరువలేం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్తు సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందించిన సాయం మరువలేమని ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. కరోనా విపత్తు  సమయంలో దేశంలో ఏ ఎమ్మెల్యే  చేయని విధంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను సొంత నిధులతో ఆదుకుంటున్న మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి హేమేంద్రకుమార్‌ రెడ్డి, మల్లం చంద్రమౌళి రెడ్డి, మైనారిటీ నాయకులు మస్తాన్, ఔరంగజేబు, ఎంపీడీఓ రాధమ్మ, తహసీల్దార్‌ చంద్రమోహన్, డీఎస్పీ నరసప్ప, సీఐ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top