బిల్లుపై చర్చను బహిష్కరించండి | boycott discussion on telangana draft bill in assembly | Sakshi
Sakshi News home page

బిల్లుపై చర్చను బహిష్కరించండి

Dec 24 2013 1:55 AM | Updated on Sep 2 2017 1:53 AM

బిల్లుపై చర్చను బహిష్కరించండి

బిల్లుపై చర్చను బహిష్కరించండి

సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రజాప్రతినిధులంతా అసెంబ్లీలో విభజన బిల్లుపై జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు.

 సమైక్యాన్ని కోరుకునే ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
 చర్చలో పాల్గొంటే విభజనకు సహకరించినట్టే అవుతుంది
 మీ వాదనను మీరే వ్యతిరేకించినట్టు అవుతుంది: జస్టిస్ లక్ష్మణరెడ్డి
 విభజనను వ్యతిరేకించేవారంతా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలి
 

 సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రజాప్రతినిధులంతా అసెంబ్లీలో విభజన బిల్లుపై జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. కేవలం విభజన కోసం ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చలో పాల్గొనడమంటే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని స్పష్టం చేశారు. తీర్మానంపై ఓటింగ్ అంటూ ముఖ్యమంత్రి చెబుతున్న మాటలన్నీ బూటకమని మండిపడ్డారు. కావాలంటే విభజన కావాలా.. వద్దా అంటూ ఒక తీర్మానం తీసుకువచ్చి ముందు దానిపై ఓటింగ్ చేపట్టాలని, అందులో మెజారిటీ సభ్యులు విభజనకు అంగీకరిస్తే అప్పుడు బిల్లుపై చర్చ చేపట్టాలని సూచించారు. విభజనను వ్యతిరేకించే ఎమ్మెల్యేలంతా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలన్నారు.

వేదిక సభ్యుడు పి.రాంబాబుతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని తెలుగు ప్రజావేదిక కార్యాలయంలో లక్ష్మణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘బిల్లుపై ఓటింగ్ పెడతామని ముఖ్యమంత్రి చెబుతోందంతా నాటకమే. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకమని మేం భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని కలిపి ఉంచాలా, విడదీయాలా అన్న క్లాజు ఈ బిల్లులో ఎక్కడైనా ఉందా? అలా ఉంటే దానిపై ఓటింగ్ పెట్టినా, సవరణలు పెట్టినా అర్థం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేదు కాబట్టి చర్చలో పాల్గొంటే ఆత్మహత్యాసదృశమే అవుతుంది. విభజన ఎలా జరపాలన్నదే ఈ ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం. అసెంబ్లీల్లో తీర్మానం లేకుండా రాష్ట్రాలను విభజించే హక్కు కేంద్రానికి లేదు అని వాదిస్తున్నప్పుడు చర్చలో పాల్గొనడమంటే అది విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. బిల్లు తయారీతో చట్టసభలకు జరిగిన అవమానాన్ని ఎత్తిచూపకుండా.. బిల్లు గురించి చర్చించడమంటే అర్థమేంటి? అలా చేస్తే బిల్లుకు సహకరించినట్టే అవుతుంది. మీ వాదన బలహీనపడుతుంది. విభజనే అంగీకారయోగ్యం కాదన్నప్పుడు బిల్లుపై చర్చించడం అంటే మీ వాదనను మీరే వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటుంది’’ అని లక్ష్మణరెడ్డి అన్నారు.

ముసాయిదా బిల్లుపై జరిగే చర్చను సమైక్యవాదాన్ని బలపరిచే శాసనసభ్యులందరూ బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యవాద తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గెలిపించుకోవటానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ‘‘విభజన కావాలా వద్దా అని తీర్మానం తీసుకురండి. కావాలంటే దానిపై ఓటింగ్ పెట్టండి. ఆ తీర్మానంలో మెజారిటీ సభ్యులు విభజనకు అంగీకరిస్తేనే అప్పుడు చర్చలో పాల్గొనవచ్చు. అలా లేకుండా నేరుగా బిల్లుపై చర్చలో పాల్గొనడమంటే అంత కంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు విభజన చర్చలో పాల్గొని రేప్పొద్దున సుప్రీంకోర్టులో ఏమని వాదిస్తారు?’’ అని నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు.

 ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుచుకోవాలి

 ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అసెంబ్లీలో సమైక్యవాణిని వినిపించాలని లక్ష్మణరెడ్డి కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ ప్రజల అభిమతానికి అనుగుణంగా శాసనసభలో నడుచుకోవాలన్నారు. ‘‘మనం ఇటీవలే ఢిల్లీలో చూశాం. అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించారంటే అది అక్కడున్న 5 లక్షల మంది తెలుగువారి ధృ డమైన అభిప్రాయం వల్లే సాధ్యమైంది. ఇక్కడుండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రతినిధులు కూడా దీన్ని గమనించి ఇక్కడి ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలి. అప్పుడే వారికి భవిష్యత్తు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలే సుప్రీం అన్నారు. ‘‘చట్టసభలే సుప్రీం. ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక వ్యవస్థ) కాదు. ఏ చట్టసభలో తీర్మానంపై చర్చించకుండా విభజనపై నిర్ణయం తీసుకునే ప్రభుత్వానికి అధికారం లేదన్నదే మా వాదన. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో చెబుతాం’’ అని స్పష్టం చేశారు.

3 నుంచి సమైక్య కళాభేరి

విభజనతో కలిగే నష్టాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి సీమాంధ్రలో సమైక్య కళాభేరిలను నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. అన్ని మం డల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 120 మంది కళాకారులతో కూడిన 13 కళా బృందాలు కోలాటం, జానపదం, నృత్యనాటికలు, వీధి నాటికలతో పలు కళారూపాలను ప్రదర్శించనున్నాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement