‘కోటి’ తిప్పలు | bank officials ready to make settlements | Sakshi
Sakshi News home page

‘కోటి’ తిప్పలు

Feb 7 2014 2:58 AM | Updated on Sep 2 2017 3:24 AM

రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన శాఖలో గత ఏడాది జరిగిన చోరీకి సంబంధించి బ్యాంకు అధికారులు ఖాతాదారులతో సెటిల్‌మెంట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

 రాజంపేట, న్యూస్‌లైన్:  రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన శాఖలో గత ఏడాది జరిగిన చోరీకి సంబంధించి బ్యాంకు అధికారులు ఖాతాదారులతో సెటిల్‌మెంట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన బ్యాంకులో జరిగిన చోరీ జిల్లాలో సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. రూ. 18 లక్షల నగదు, 62 మంది ఖాతాదారులకు సంబంధించి తాకట్టు పెట్టిన 3 కిలోల బంగారు నగలు కలిపి మొత్తం దాదాపు రూ.కోటి చోరీకి గురైనట్లు అప్పట్లో బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల సమస్య పరిష్కారానికి ఏపీజీబీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
 
 న ష్టపోయిన వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని తీర్మానించింది. ఈ దిశగా అధికారులు దృష్టి సారించారు. తాకట్టు పెట్టిన 62 మందిలో  నలుగురు మాత్రం తాము తీసుకున్న అప్పును బ్యాంకుకు చెల్లించినట్లు సమాచారం. దీంతో అధికారులు పక్కాగా రికార్డు ఆధారంగా బాధితులు నష్టపోయిన మొత్తాన్ని చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఏపీజీబీ ఆర్‌ఎం శివశంకర్‌రెడ్డిని న్యూస్‌లైన్ వివరణ కోరగా చోరీకి గురైన ఖాతాదారుల తాకట్టు నగలు, నగదుకు సంబంధించిన చెల్లింపు ప్రక్రియను చేపడుతున్నామని స్పష్టం చేశారు.
 
 ఇలా చెల్లించాలని..
 ఖాతాదారుల డబ్బుకు సంబంధించి అంతే మొత్తాన్ని తిరిగి వారికి చెల్లించనున్నారు. అలాగే నగల విషయంలో వారికి నగలకు బదులు వాటికి సరిపడే డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. వీరికి డబ్బులు చెల్లించే నాటికి ఆ రోజున మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉందో అంత మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం.అయితే తాకట్టు పెట్టిన బంగారంపై ఖాతాదారులు తీసుకున్న అప్పులు ఏవైనా ఉంటే వాటిని లెక్కలోకి తీసుకోనున్నారు. నగలకు విలువకట్టి మొత్తంలో అప్పుగా ఉన్న మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement