
సాక్షి, తాడేపల్లి : దేశంలో అత్యున్నత నైపుణ్యం ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్రెడ్డి వెల్లడించారు. బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్స్ అవార్డ్స్లో మన రాష్ట్రానికి గోల్డ్ మెడల్ రావడం సంతోషకరమని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన నైపుణ్యాభివృద్ధిలో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ అవార్డును ప్రదానం చేసిందని తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణలో ఆరు నెలల్లోనే వేలాది మందికి శిక్షణనిచ్చామని వివరించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా యువతకు శిక్షణనిస్తున్నామని తెలియజేశారు.