
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. మానవ తప్పిదం వలనే ప్రమాదం జరిగిందని అన్నారు. వైజాగ్లో జరిగిన సంఘటన దురదృష్టకరమని, అలారం మోగించకపోవడం యాజమాన్యం తప్పుగా ఆయన పేర్కొన్నారు.
ఎంతో మంది సీఎంలను చూశాను కానీ.. : విష్ణుకుమార్ రాజు
విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించడం సామాన్య విషయం కాదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ పెద్ద మొత్తంలో, అక్కడికక్కడే ప్యాకేజ్ ప్రకటించడం ఎవ్వరూ చేయలేదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్కు అభినందనలు తెలియజేశారు. ఇది రాజకీయం కాదని, మాట్లాడటానికి కానీ.. విమర్శలు చేయడానికి కానీ వీలు లేకుండా, బాధిత కుటుంబాలతో పాటు వారి తర్వాత జనరేషన్ కూడా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చేయూత నివ్వడం అభినందిస్తున్నానన్నారు.
( మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్ )
సీఎం జగన్ ప్రకటన హర్షణీయం: లక్ష్మీపతి రాజా
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైజాగ్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడం హర్షణీయమని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా అన్నారు. వెంటిలేటర్పై ఉన్న వాళ్లకు 10 లక్షలు, హాస్పిటల్లో చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన భగవంతున్ని ప్రార్థించారు.
(గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు)
అదో గొప్ప సహాయం : ఎమ్మెల్సీ మాధవ్
అమరావతి : ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి రూపాయలు పరిహారం ప్రకటించటం హర్షణీయమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రతి ఇంటికి 10 వేలు ఇవ్వాలన్న నిర్ణయం కష్టకాలంలో ఓ గొప్ప సహాయంగా ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు అవసరమని అన్నారు.