చంద్రబాబుకు అంగన్వాడీల షాక్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంగన్వాడీ మహిళలు షాక్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నకు అంగన్వాడీలు ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా సీఎం కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అంగన్వాడీల అవగాహన సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గతంలో అంగన్వాడీలకు సెల్ఫోన్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఎంతమందికి సెల్ఫోన్లు అందాయో చేతులు ఎత్తాలని కోరారు.
కానీ తమకు సెల్ఫోన్లు అందలేదంటూ అందరూ చేతులు ఎత్తడంతో ఆయన ఒక్కసారిగా బిక్కమొహం వేశారు. చంద్రబాబు ఆ తప్పును అధికారుల మీదకు నెట్టి తప్పించుకున్నారు. అధికారులు సెల్ఫోన్లు ఇవ్వకుండానే తనతో ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఆగస్టు 15 కల్లా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందిస్తామని హామీ ఇచ్చి తన అలవాటైన విద్యను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదని అంగన్వాడీలు వాపోయారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.