మరమ్మతుల పేరుతో రూ.245.63 కోట్ల దోపిడీ | Above Rs 245 crore was Robbery in the name of repairs | Sakshi
Sakshi News home page

మరమ్మతుల పేరుతో రూ.245.63 కోట్ల దోపిడీ

Feb 19 2019 3:37 AM | Updated on Feb 19 2019 8:27 AM

Above Rs 245 crore was Robbery in the name of repairs - Sakshi

రోజుకు ఐదారు మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వుతున్నారనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై ప్రభుత్వ పెద్దలు వేటువేశారు.

సాక్షి, అమరావతి : రోజుకు ఐదారు మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వుతున్నారనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై ప్రభుత్వ పెద్దలు వేటువేశారు. ఆ తర్వాత దాని అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి ఆ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులను కమీషన్లుగా దండుకున్నారు. సొరంగాలను తవ్వే టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)కు కొత్త బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌లు అమర్చకుండానే అమర్చినట్లుగా, మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.245.63 కోట్లను కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు మింగేశారు. వెలిగొండ ప్రాజెక్టులో జరుగుతున్న ఈ బాగోతం వివరాలివీ..

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 4.47లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును 2005లో రూ.5,150 కోట్లతో చేపట్టారు. తన హయాంలో 75 శాతానికిపైగా పనులు పూర్తిచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్‌.. డిసెంబరు 26నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి ప్రకాశం జిల్లాకు నీరందిస్తామని 2016 జూన్‌ 2న సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ క్రమంలో సొరంగాల పనులను శరవేగంగా పూర్తిచేయాలంటే టీబీఎంలకు కొత్త బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌లు అమర్చాలని కాంట్రాక్టర్లు చేసిన ప్రతిపాదనలను సర్కార్‌ ఆమోదించి రూ.68.44కోట్లను మంజూరు చేసింది. కానీ.. టీబీఎంలకు ఎలాంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి ఆ నిధులను కాంట్రాక్టర్లతో కలిసి కీలక మంత్రి మింగేశారు. దీంతో రోజుకు ఐదారు మీటర్ల చొప్పున మాత్రమే సొరంగాల పనులు జరుగుతుండడంతో సీఎం మాటమార్చారు. జనవరి, 2019 నాటికి మొదటి సొరంగం, ఆగస్టు, 2019 నాటికి రెండో సొరంగం పూర్తిచేస్తామని జూన్‌ 8, 2018న చెప్పారు.

రోజుకు పది మీటర్ల లక్ష్యంతో..
2018 నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌లో 3.6కి.మీ, రెండో టన్నెల్‌లో 8.037కి.మీ.ల పనులు మిగిలాయి. రోజుకు ఐదారు మీటర్ల మేర కూడా పనులు చేయడంలేదనే సాకుతో.. పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద ముఖ్యనేత సూచనలతో వేటు వేయించారు. దీంతో మొదటి సొరంగం పనుల్లో రూ.116.447 కోట్లు, రెండో సొరంగంలో రూ.299.48 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. ఆ తర్వాత ధరల సర్దుబాటు, పనుల పరిమాణం పెంచి అదనపు చెల్లింపుల ద్వారా ఆ విలువను మొదటి సొరంగానికి రూ.186.31కోట్లు, రెండో సొరంగం  విలువను రూ.479.17కోట్లుగా జలవనరుల శాఖాధికారులు నిర్ణయించారు. ఇక ఈ పనులలో భారీ కమీషన్లు వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇందుకు అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. దీంతో టీబీఎంల బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌ మార్చడం పేరుతో మొదటి సొరంగం పనుల వ్యయాన్ని రూ.292.15 కోట్లకు, రెండో సొరంగం వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేసి రోజుకు సగటున పది మీటర్ల చొప్పున సొరంగం తవ్వాలనే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. మొదటి టన్నెల్‌ పనులను రూ.245.39 కోట్లకు ‘మేఘ’కు, రెండో టన్నెల్‌ పనులను రూ.597.11 కోట్లకు రిత్విక్‌కు గత నవంబర్‌లో కట్టబెట్టారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద రూ.84.2 కోట్లను ఇచ్చేసి వాటినే తొలి విడత కమీషన్ల కింద వసూలు చేసుకున్నారు.

మాయచేసి దోచేశారు..
కానీ, నవంబరు నుంచి ఇప్పటివరకూ మొదటి సొరంగంలో రోజుకు సగటున ఐదు మీటర్లు, రెండో సొరంగంలో రెండు మీటర్ల చొప్పున మాత్రమే పనులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశాన్ని ప్రతి సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షల్లో వెలిగొండ అధికారులు చెబుతున్నా పట్టించుకునే నాథుడులేడు. టీబీఎంలకు బుష్‌లు, బెల్ట్‌లు అమర్చకుండానే అమర్చినట్లు చూపి మొదటి సొరంగంలో రూ.86.88 కోట్లు, రెండో సొరంగంలో రూ.158.75 కోట్లు వెరసి రూ.245.63 కోట్లను దోచుకున్నారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు.. పనులు పూర్తికాకపోవడంతో గడువును మరోసారి పెంచారు. అయినా.. మొదటి సొరంగం మార్చి 2020, రెండో సొరంగం పనులు జనవరి 2021 నాటికి కూడా పూర్తయ్యే అవకాశాల్లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు. పాత కాంట్రాక్టర్లను కొనసాగించినా అదే సమయానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉండేదని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.596.36 కోట్లు ఆదా అయ్యేవని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement