సమైక్య రాష్ట్ర సాధనే లక్ష్యంగా చిన్న పెద్దా తేడా లేకుండా ప్రజానీకం ఉద్యమించారు.
సాక్షి ప్రతినిధి, కడప: సమైక్య రాష్ట్ర సాధనే లక్ష్యంగా చిన్న పెద్దా తేడా లేకుండా ప్రజానీకం ఉద్యమించారు. ప్రజల కోసం ప్రాంతం కోసం ముందుండాల్సిన అధికార పక్ష నేతల్లో అప్పట్లో ఏమాత్రం చలనం లేదు. ప్రభుత్వాల మెడలు వంచి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పదవులను త్యాగం చేయడంలో వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానాన్ని కాదని, ప్రజల వైపు మొగ్గు చూపలేకపోయారు. అసలు ఉన్నారో... లేదో తెలియకుండా వ్యవహరించారు. హ ఠాత్తుగా పార్లమెంటులో ధీరులుగా ఫోజులు ఇస్తూ పార్టీ నుంచి సస్పెన్షన్ అంటూ కొత్త నాటకానికి తెరలేపారు.
పదవులే ధ్యేయంగా...
పార్టీ విధేయులుగా...
ఇంకో నెలలో కాలం తీరే పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మం త్రులు ప్రాంతానికి తీరని ద్రోహానికి ఒడిగట్టారు. అధిష్టానం ఏక పక్ష నిర్ణయాన్ని ధిక్కరించి ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రజాప్రతినిధులు చేష్టలుడిగి కూర్చుండి పోయారు. ప్రజాభీష్టం మేరకు పదవులను త్యజించి ఉద్యమ సారధ్య బాధ్యతలను భుజసంధాలపై వేసుకోవాల్సిన కాంగీయులు అధిష్టానం చేపట్టిన రాష్ట్ర విభజన గేమ్ ప్లాన్లో భాగస్వాములయ్యారు. ఆమేరకు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. పదవులను త్యజించండి.. యూ పీఏ ప్రభుత్వాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టండని మొదటి నుంచి సమైక్యవాదులు మొత్తుకున్నా స్పందించని స్థితిలో రాజం పేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ ఉండిపోయారు. ఎమ్పీ హరికృష్ణ లాగా పదవీ త్యాగం చేసేందుకు వెనుకంజ వేశారని పలువురు పేర్కొంటున్నారు.
ఉద్యమంలో ముఖం చాటేసి..
జిల్లాకు చెందిన మంత్రులు అహ ్మదుల్లా, రామచంద్రయ్య, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్, ఎమ్మెల్యేలు డీఎల్ రవీంద్రారెడ్డి, కమలమ్మ, వీరశివారెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు సమైక్య ఉద్యమం పట్ల ముఖం చాటేశారని పలువురు సమైక్యవాదులు ఆరోపిస్తున్నారు. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న తరుణంలో ఉద్యమాన్ని దగ్గరుండి నిర్వహించాల్సిన నాయకులు అప్పట్లో జిల్లాలో కన్పించకుండా పోయారనే విమర్శలున్నాయి.
‘వీరు మా నేతలు... కన్పిస్తే చెప్పండీ పారితోషకం ఇస్తామంటూ’ సమైక్యవాదులు ప్రకటనలు సైతం ఇచ్చారు. అప్పట్లో ప్రత్యక్షంగా ప్రజలతో కలిసి పోరాటం చేయకుండా తెరచాటుకు వెళ్లా రు. ఇవేవి పట్టించుకోకుండా అధిష్టానం ఆడిన నాటకంలో భాగస్వాములుగా నిలిచారని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పాక కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పదవులను అంటిపెట్టుకొన్న ఉదంతాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ మంత్రాన్ని తెరపైకి తెచ్చి సమైక్యవాదులుగా గుర్తింపు పొం దేందుకు మాత్రమే తాపత్రయ పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.