ఉల్లాసంగా..ఉత్సాహంగా
63వ రాష్ట్రస్థాయి కబడ్డీæ పోటీలు ప్రారంభం
12 జిల్లాల నుంచి తరలి వచ్చిన క్రీడాకారులు
బాలికల విభాగంలో సత్తాచాటిన తూర్పు, పశ్చిమగోదావరి జట్లు
బాలుర విభాగంలో నెల్లూరు, గుంటూరు జట్ల హవా
బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక డీఎల్ఎన్ఆర్ పాఠశాల క్రీడామైదానంలో 63వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం 12 జిల్లాల క్రీడాకారులను అధికారులు, నేతలు పరిచయం చేసుకుని ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్బాషా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కే కోటేశ్వరమ్మ, అబ్జర్వర్ సీ మాల్రెడ్డి, సర్పంచ్ జూగుంట స్నేహలత, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకుడు భీమతాటి వెంకటరమణయ్య, జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే...బాలుర విభాగంలో
కృష్ణాపై వైజాగ్, విజయనగరంపై శ్రీకాకుళం, ప్రకాశంపై, తూర్పుగోదావరి, చిత్తూరుపై గుంటూరు జట్లు విజయం సాధించాయి. అలాగే పశ్చిమగోదావరిపై కడప, కృష్ణాపై, కర్నూల్, శ్రీకాకుళంపై నెల్లూరు, కడపపై గుంటూరు, అనంతపురంపై తూర్పుగోదావరి జట్లు గెలుపొందాయి.
బాలికల విభాగంలో..
కడపపై చిత్తూరు, కర్నూలుపై ప్రకాశం, శ్రీకాకుళంపై వైజాగ్, కృష్ణాపై పశ్చిమగోదావరి జట్లు విజయం సాధించాయి. అలాగే చిత్తూరుపై తూర్పుగోదావరి, నెల్లూరుపై విజయనగరం జట్లు గెలుపొందాయి. కాగా విజయనగ రం–గుంటూరు జట్ల మధ్య జరిగిన పోటీ టైగా ముగిసింది.