పెళ్లి అయిన రెండు నెలలకే.. | 498A replied to talaq notice | Sakshi
Sakshi News home page

పెళ్లి అయిన రెండు నెలలకే..

Dec 8 2017 6:13 PM | Updated on Dec 8 2017 6:21 PM

498A replied to talaq notice - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు(మదనపల్లె క్రైం): పెళ్లి అయిన రెండు నెలలకే ఓ వ్యక్తి కట్టుకున్న భార్యకు తీరని మోసం చేశాడు. అభం శుభం తెలియని ఇళ్లాలిని పుట్టినింటికి పంపేసి, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా సౌదీకి వెళ్లిపోయాడు. ఏడాది గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు తనకు భార్య అవసరం లేదంటూ లాయర్‌ ద్వారా ఓ తలాక్‌ పంపి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కూతురు జీవితం బాగుండాలని ఓ ఆటోవాలా ఆస్తులమ్మి మరీ కూతురు పెళ్లి చేశారు. తలాక్‌ నోటీసులు పంపడంతో చివరకు ఆ యువతి తనకు చావే మార్గమని ఆత్మహత్యాయత్నంకు పాల్పడటంతో తల్లి తండ్రులు గమనించి ఆయువతిని రక్షించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌కుమార్, బాధితురాలి తల్లి తండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బసిని కొండ పుంగనూరు రోడ్డు జన్మభూమి కాలనీకి చెందిన ఆటోవాలా ఎస్‌ఏ రషీద్, ఆయిషాల దంపతుల కుమార్తె సైదా సుల్తానా(20). డిగ్రీ చదువుతున్న సమయంలో ఆ యువతి తల్లి తండ్రులు కలికిరి మండలం పలవలి గ్రామం గడికి చెందిన కలకడ జహీరుద్దీన్, బీబీజాన్‌ల కుమారుడు మౌలా అహమ్మద్‌(28)తో గత ఏడాది డిసెంబర్‌ 19న మదనపల్లె టౌన్‌ హాలులో సుమారు రూ.నాలుగు లక్షలు ఖర్చుచేసి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత మౌలా అహమ్మద్‌ రెండు నెలలు కూడా భార్యతో కలసి జీవించ కుండానే భార్యను మోసగించి సౌదీకి వెళ్లి పోయాడు. భర్తకోసం అత్తమామలను నిలదీసిన సైదా సుల్లానాకు వేధింపులు, ఛీదరింపులు ఎదురైయ్యాయి. సుల్తానా చేసేది ఏమీలే  అత్తగారి ఇంట్లో ఉండలేక ఏడు నెలల క్రితం పుట్టింటికి చేరుకుంది. అదే అదనుగా భావించిన సైదా సుల్తానా భర్త, అత్తమామలు బావలు కలసి ఓ లాయర్‌ సహాయంతో సైదా సుల్తానా తలాక్‌ పంపించారు. మోసపోయానని భావించి ఆ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని రూరల్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ సయ్యద్‌ మౌలా అహ్మద్‌ అతని తల్లి తండ్రులపై 498ఏ, ఛీటింగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement