ఏపీ: త్వరలో వీఆర్‌వో పోస్టుల భర్తీ | 3795 VRO Posts Recruitment Soon In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

త్వరలో 3,795 వీఆర్‌వో పోస్టుల భర్తీ

Jun 5 2020 7:54 AM | Updated on Jun 5 2020 8:46 AM

3795 VRO Posts Recruitment Soon In Andhra Pradesh - Sakshi

రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) గ్రేడ్‌ –2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది.

సాక్షి, అమరావతి : రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) గ్రేడ్‌ –2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (గ్రేడ్‌–2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్‌) ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే సానుకూల నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్‌వో పోస్టులను ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతినిచ్చింది. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు)

ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఈ ఫైలును పక్కన పెట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఉన్న అర్హతలపై సందిగ్ధతను తొలగిస్తూ, చిన్న సడలింపు ఇస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ ద్వారా ఆదేశాలు 
జారీ చేశారు. (మీ అన్నగా, తమ్ముడిగా  సాయం )

మార్గదర్శకాలివీ..
►  కచ్చితంగా ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.  
►  ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్‌ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి.  
► ఇంటర్మీడియట్‌ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే.  
► ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. 
► అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా ఎంపిక చేసేందుకు వన్‌టైమ్‌ ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement