ఏపీలో 24 పాజిటివ్
ఒక్క గుంటూరు జిల్లాలోనే 17..
దీంతో ఇక్కడ లాక్డౌన్ మరింత పటిష్టం.. గుంటూరు సిటీ అంతా కంటైన్మెంట్ జోన్గా ప్రకటన
విజయవాడలో మరో యువకుడు డిశ్చార్జి
ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు 11 మంది
రాష్ట్రంలో 405కు చేరిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం సాయంత్రం వరకు జరిగిన కోవిడ్–19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశంలో ఒకటి, వైఎస్సార్ జిల్లాలో ఒకటి చొప్పున కొత్తగా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 405కి చేరింది. శనివారం ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 17 కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేశారు. గుంటూరు నగరం అంతా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మాస్కులు లేకుండా బయటకువస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ప్రకటించారు. ఆదివారం గుంటూరు జిల్లా మొత్తం పూర్తిగా లాక్డౌన్ విధించారు. ఇదిలా ఉంటే..
– రాష్ట్రంలో నమోదైన మొత్తం 405 పాజిటివ్ కేసులకు గాను ఇప్పటివరకు 11 మంది డిశ్చార్జ్ కాగా ఆరుగురు (అనంతపురంలో–2, కృష్ణాలో–2, గుంటూరు–1, కర్నూలు–1) మృతిచెందారు.
– ఆస్పత్రుల్లో ప్రస్తుతం 388 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది.
– కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన మరో బాధితుడు (28 ఏళ్లు) మార్చి 19న స్వీడన్ నుండి వచ్చాడు. వైరస్ లక్షణాలతో 20న జీజీహెచ్లో చేరాడు. డాక్టర్, పారా మెడికల్ సిబ్బంది పర్యవేక్షణలో కోవిడ్ టెస్ట్లో మూడుసార్లు నెగటివ్ రావడంతో శనివారం డిశ్చార్జి చేశారు.
సంబంధిత వార్తలు