చాపాడు : చాపాడు మండల పరిధిలోని రేపల్లెలో ప్రైవేట్ ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కంభంపాటి రామాంజనేయులు (42) బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం వివరాలు ఇలా ఉన్నాయి. రేపల్లె గ్రామంలో మృతుడు తన ఇంటికి ప్రొద్దుటూరుకు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం పొందాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో కొన్ని కంతులు పెండింగ్లో పడ్డాయి. దీంతో ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెందిన రామాంజనేయులు మంగళవారం పురుగుల మందు తాగాడు.ప్రొద్దుటూరులో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
‘20న మదనపల్లెలో సీఎం కాన్వాయ్ని అడ్డుకుంటాం’
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటనను అడ్డుకుంటామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం కడప పాత మున్సిపల్ కార్యాలయంలో డైలీ వేజ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ఎక్కడికి అక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకోవాలని నిర్ణయించినట్లు, ఇందులో భాగంగా మదనపల్లెలో జరుగుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రెండు లక్షలకు పెంచి ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆప్కాస్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై నెల 7వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు వీరమల్లి నరసింహులు, కలువాయి ఈశ్వరయ్య, కోశాధికారి వెంకటాద్రి, యూనియన్ నాయకులు వేలంగి రాజశేఖర్, బక్క రాజేష్, అశోక్ పాల్గొన్నారు.
యువతిని మోసగించిన కేసులో వ్యక్తి అరెస్ట్
కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న మహేశ్వర్రెడ్డికి భార్య, పిల్లలున్నారు. రాయచోటికి చెందిన సచివాలయ ఉద్యోగితో ఇన్స్ట్రాగాంలో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి సన్నిహిత జీవితాన్ని గడిపాడు. నిందితుడికి భార్య, పిల్లలున్నారని, తనను మోసం చేశాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ నరసింహారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
మైదుకూరు : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై చింతకుంట బయనపల్లె వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. మైదుకూరు మండలం వనిపెంట అటవీ రేంజ్ గంజికుంట బీట్ పరిధిలో ఈ సంఘటన జరిగిందని ఎఫ్ఆర్ఓ చలపతి నాయుడు తెలిపారు.


