కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్కు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హాల్ టికెట్ చూపించి నీట్ విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో ఏడుగురు
ఎస్ఐల బదిలీలు
కడప అర్బన్: కడప జిల్లాలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప డీసీఆర్బీలో ఉంటున్న ఎం. సత్యనారాయణను జమ్మలమడుగు యూజీఎస్కు బదిలీ చేశారు. జమ్మలమడుగు యూజీఎస్లో విధులు నిర్వహిస్తున్న పి. హైమావతిని తలముంచి పట్నం పీఎస్కు, అక్కడ పని చేస్తున్న సి. లక్ష్మీనారాయణను కడప వన్టౌన్కు బదిలీ చేశారు. జి. అమర్నాథ్ రెడ్డిని కడప వన్టౌన్ నుంచి డీసీఆర్బీకి, టి. హరిప్రసాద్ను కడప తాలూకా నుంచి చిన్నచౌక్ పీఎస్కు బదిలీ చేశారు. అలాగే కడప సైబర్సెల్లో విధులు నిర్వహిస్తున్న వి. నారాయణను కడప తాలూకాకు, వీఆర్లో ఉంటున్న ఎస్ కే అహ్మద్ను పీసీఆర్ ప్రొద్దుటూరు పీఎస్కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
జెడ్పీ సీఈఓ తనిఖీ
రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిషత్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ డిఫ్యూటీ సీఈఓ రామచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమీషన్) నిధులపై చర్చించారు. అలాగే జనరల్ ఫండ్ నిధులు, అక్షరాంధ్ర కార్యక్రమం, తల్లికి వందనం, పథకాలపై చర్చించారు. ఆయా పథకాల పురోగతి ఎలా ఉందనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు.
కడప ఎడ్యుకేషన్: ఉర్దూ భాషను ప్రోత్సహించడం, ఉర్దూ మాట్లాడని వారికి సులభంగా ఉర్దూ బోధించడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ రూపొందించిన ‘ఆవో ఉర్దూ సీఖేన్’ పుస్తకం ఆధారంగా కడపలోని ఎస్.కె.ఆర్ – ఎస్.కె.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 30 రోజుల ప్రత్యేక ఉర్దూ శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం బాషా మాట్లాడుతూ, ఉర్దూ ఏ మతానికో లేదా ఒక ప్రత్యేక వర్గానికో చెందిన భాష కాదని, అది భారతదేశ ఉమ్మడి నాగరికత, సంస్కృతి సంప్రదాయానికి ఒక అందమైన ప్రతీక అని అన్నారు. అడకమిక్ కో ఆర్డినేటర్ డా. నాగమణి రెడ్డి సహకారంతో, ఉర్దూ విభాగ అధ్యక్షురాలు డా. షాజియా బేగం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఖిద్మత్–ఎ–ఖల్ఖ్ ఫౌండేషన్ ఛైర్మన్ ముహమ్మద్ గియాస్ షరీబ్ , కడప ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్ ఇన్చార్జి మహమ్మద్ జహీర్, ఉర్దూ కంప్యూటర్ ఫ్యాకల్టీ షేక్ మస్తానీ, లైబ్రేరియన్ హసీనా బానో పాల్గొన్నారు.


