కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలోని బీఎల్ఓలు ఆయా ఏఈఆర్ఓ కార్యాలయాల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకుని ఇంటింటి సందర్శన కార్యక్రమానికి వెళ్లారు. ఓటర్లకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ప్రధాన పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బీఎల్ఓల వెంట ఇంటింటిని సందర్శించారు. తొలిరోజు కావడంతో చాలా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఇంటింటికి బీఎల్ఓలు వెళ్లలేకపోయారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 287 పోలింగ్ కేంద్రాలు ఉండగా, చాలా ప్రాంతాల్లో బీఎల్ఓలు రాలేదని ప్రజలు తెలిపారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం వచ్చేనెల 14వ తేది వరకు జరగనుంది. మృతి చెందిన, డూప్లికేట్, శాశ్వత వలసలు వెళ్లిపోయిన వారి ఓట్లను జాబితాలో నుంచి తొలగించనున్నారు. అలాగే విదేశీయులు ఎవరైనా జాబితాలో ఓటరుగా ఉంటే గుర్తించి తొలగిస్తారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీయే ‘సర్’ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 18,94,520 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 19,952 ఉండగా, బీఎల్ఓలు అదే సంఖ్యలో ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు 1963 మంది బీఎల్ఓలు 52,959 ఎన్యుమరేషన్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు.


