ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 1న అనారోగ్యం కారణంగా జిల్లా ఆస్పత్రిలో చేరిన అతను తన పేరు బాలగంగాధర్ (56) అని ఐపీ రిజిస్టర్లో రాయించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన బంధువులు జిల్లా ఆస్పత్రిలోని అవుట్ పోస్ట్లో సంప్రదించాలని ఔట్ పోస్ట్ ఇన్చార్జి షబ్బీర్ బాషా తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఒక ఆటో చోరీ చేసిన కేసులో శనివారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకర్ల సమావేశంలో మన్నూరు సీఐ ఎస్.లింగప్ప వివరాలు వెల్లడించారు. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న వినాయక గుడి వెనుక వైపు పార్కింగ్ చేసి ఉంచిన ఆటో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చోరీకి గురి అయింది. దీనిపై బాధితులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేపట్టారు. నిందితుడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్లో నివాసం ఉంటున్న చిట్టివడ్డి మురళీ కృష్ణ అని తెలియడంతో అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు. నిందితుడిపై ఇది వరకే కదిరి టౌన్ పీఎస్, పీలేరు పీఎస్, తిరు మల 2 టౌన్ పీఎస్లో ఆటో, మోటార్ సైకిల్ చోరీల కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు.
ఆటో, బైక్ రికవరీ
మైదుకూరు : మైదుకూరు పట్టణంలో ఆటో, ఓ మోటార్ బైక్ చోరీ కేసులో ఇడగొట్టు రాఘవేంద్ర అలియాస్ గండి వీరాంజనేయులు అనే నిందితుడిని అరెస్టు చేశారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తన కార్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. మైదుకూరులో గత నెల 29న ఆటో, ఈ నెల 3న మోటార్ బైక్ చోరీకి గురి కాగా వాటి యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ కేసుల్లో ఉన్న ఇద్దరు నిందితుల్లో జగనన్న కాలనీకి చెందిన ఇడగొట్టు రాఘవేంద్ర అలియాస్ గండి వీరాంజనేయులును మైదుకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన మరో నిందితుడు షరీఫ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన ఆటో, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇడగొట్టు రాఘవేంద్రపై ప్రొద్దుటూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో రెండు దొంగతనాల కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ వెంకటరమణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


