పులివెందుల : ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు అనేక అబద్ధపు హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో సంతకాలు చేసిన బాండ్ల కాపీలు కూడా ఇచ్చానని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలు కానీ, వాటితోపాటు మేనిఫెస్టోలో పెట్టిన మరో 143హామీలు ఎంతమాత్రం అమలుపరిచారో ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి పెద్దలకు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండేళ్లలో అంతా చేశామని చెప్పుకుంటూ విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడం కూటమి నేతలకే చెల్లిందని విమర్శించారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమవుతున్నా.. తల్లికి వందనం పథకం ఊసేలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానంగా పవిత్రంగా భావించి మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కూటమి నాయకులకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
నేటి ర్యాలీలను జయప్రదం చేయండి...
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసన ర్యాలీలలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు.


