రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల చట్టాల అమలులో అలసత్వం వహిస్తే సహించబోమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యా హక్కు అమలు, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నియంత్రణ, పాఠశాలలు–హాస్టళ్లలో భద్రతా ప్రమాణాల అమలుపై జిల్లా స్థాయి వర్క్షాప్, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యా హక్కు చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, జువైనెల్ జస్టిస్ చట్టం అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.


