సాక్షి ప్రతినిధి, కడప: ‘జై జవాన్, జై కిసాన్’ స్ఫూర్తి నేటి పాలకులకు కొరవడింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న జవాన్ వీరమరణం చెందితే ఆదుకోవాలనే కనీస స్పృహలేకుండా సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఏడాదిన్నర్రగా పరిహారం ఇవ్వకపోగా, కుటుంబాన్ని ఆదుకోవాలనే దిశగా ఒక్క అడుగూపడని దుస్థితి నెలకొంది.
● బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొడవటికంటి రాజేష్ (36) ఇండో టిబెటన్ పోర్ట్ బార్డర్ (ఐటీపీబీ)లో 17ఏళ్లుగా జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా చత్తీస్గడ్ అడవుల్లో మావోయిస్టుల దుశ్చర్య కారణంగా 2024 అక్టోబర్ 19న మృత్యువాత పడ్డారు. 36ఏళ్ల వయస్సులో జవాన్ రాజేష్ మృతి చెందడంతో ఆ కుటంబం దీనావస్థకు చేరింది. ముక్కుపచ్చలారని ముగ్గురు బిడ్డల ఆలనా పాలన చూసుకోవడం సతీమణి స్వాతికి కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదిన్నర్రగా రాష్ట్ర ప్రభుత్వం కరుణ కోసం అనేక పర్యాయాలు కలెక్టరేట్ దరికి చేరింది. వీరజవాన్ కుటుంబానికి అండగా నిలవాలని, రాష్ట్ర ప్రభుత్వ పరంగా లభించాల్సిన పరిహారం, వ్యవసాయ భూమి, ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ కలెక్టర్కు విన్నవించుకున్నా అమె అభ్యర్థన బుట్టదాఖలే అయ్యింది. ఇదివరకే మృతి చెందిన వీరజవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రభుత్వపరంగా డబ్బులు, ఇంటి స్థలం. 5 ఎకరాల పొలం, రాజేష్ భార్య స్వాతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. ఇచ్చిన హామీని ఎమ్మెల్యే కూడా మరుగుపర్చారు. వీరజవాన్ కుటుంబంపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు సర్కార్ను పలువురు తూర్పారబడుతున్నారు.
మావోయిస్టు దుశ్చర్యలో మృతి చెందిన జవాన్ రాజేష్
ఏడాదిన్నర్ర అయినా ప్రభుత్వం నుంచి లభించని పరిహారం
పలుమార్లు కలెక్టర్ను కలిసినాఫలితం శూన్యం
వీరజవాన్ కుటుంబాన్ని ఆదుకోండి
బి.మఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన కె రాజేష్(36) చత్తీస్గడ్ అడవులల్లో మావోయిస్టుల మందుపాతరలకు బలి అయ్యారు. ముగ్గురు పసిబిడ్డలున్న రాజేష్ కుటుంబం పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం బాధకరం. ఇప్పటికై నా రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. –ఫిలిప్స్, అధ్యక్షుడు,
మాజీ సైనిక పెన్షనర్స్ అసోసియేషన్, కడప


