కడప కార్పొరేషన్ : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలని ఓఅండ్ఎం విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దవనం దొరబాబు, డిస్కం సెక్రటరీ బి. మురళీమోహన్, డిస్కం ప్రెసిడెంట్ డి. మౌలాలి డిమాండ్ చేశారు. ఆదివారం కో ఆపరేటివ్ కాలనీలోని ఓ ప్రైవేట్ భవనంలో తమ డిమాండ్లతో కూడిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 2026 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికై నా విద్యుత్ సంస్థ యాజమాన్యం తక్షణమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, ఓ అండ్ ఎం కార్మికులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, ఆ మేరకు సిబ్బంది నియామకాలు జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ జి. చంద్ర ఓబుల రెడ్డి, రీజినల్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. దస్తగిరి, డివిజనల్ సెక్రటరీ హరి ప్రసాద్, డివిజనల్ ప్రెసిడెంట్ గురు ప్రసాద్, టి. శేఖర్, జగదీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


