వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షీ వైధ్యనాఽథేశ్వర స్వామి , శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల ఆలయాల్లో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైధ్యనాధేశ్వర స్వామి ఆలయంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. వైధ్యనాధునికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవికి కుంకుమార్చన చేశారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై శ్రీ కామాక్షీ వైధ్యనాధ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారు జామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజను నిర్వహించారు. నవ కళశ స్థాపన, నవ కుంభారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలతో ప్రారంభించి గరుడుని చిత్ర పటాన్ని ధ్వజ స్థంభంపై అధిష్టింప చేశారు. అనంతరం భేరీ పూజ నిర్వహించారు. అనంతరం కొండపై నుండి స్వామి వారిని తిరుచ్చి వాహనంలో మోస్తూ గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.


