పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని మామిడిగొంది, దేవరగొంది ట్విన్ టన్నెల్స్ ప్రాంతంలో ఉన్న కుడి ప్రధాన కాలువ, హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఉన్న రిజర్వు అటవీ ప్రాంతంలో పులి మకాం వేసింది. శాడిల్ డ్యామ్ నుంచి స్పిల్వే దిగువకు చేరుకుని అక్కడకు మేతకు వెళ్లిన ఆవు దూడపై దాడి చేసి చంపి తిరిగి వచ్చిన దారినే వెళ్ళినట్లు పాదముద్రలు ఉన్నాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. పులి కదలికలపై ట్రాక్టర్ ద్వారా గుర్తిస్తున్నారు. పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులిని పట్టుకోవడానికి రెస్క్యూ టీంను సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి పర్యాటకుల రాకపోకలు, కొత్త వ్యక్తుల సంచారం నిషేధించారు. ప్రాజెక్టులోకి పనులు నిమిత్తం వెళ్ళే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో పశువులను మేపుకునే వారు తమ పశువులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో దూడపై పెద్ద పులి దాడి చేయడంతో ప్రాజెక్టు ప్రాంతంలోని కార్మికులు, మైదాన ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి కొండపై నుంచి దిగువకు చేరి గోదావరి నది ప్రాంతంలో ఆవుదూడను చంపి నీరు తీగి వెళ్ళినట్లు చెబుతున్నారు. పులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా పులి సంచరించే ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. 8 ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. గత వారం రోజులుగా పోలవరం మండలంలోని అభయారణ్య ప్రాంతంలో పులి సంచరిస్తూ ఇప్పటి వరకు 2 ఆవు దూడలపై దాడి చేసింది.
ప్రాజెక్టు ప్రాంతంలో దూడపై దాడి


