● పేరుకుపోయిన బకాయిలు తక్షణం చెల్లించాలి
● వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. కాకినాడ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రీజనల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. బకాయిలు ఏటా కొండలా పేరుకుపోతున్నాయని, రూ.30 వేల కోట్లకు రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చారని, అవికూడా పూర్తిస్థాయిలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.
పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారు?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోవడంతో హెల్త్కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. కొంత మంది లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోలేక.. ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అధికారిని అదే శాఖలో అదే పోస్టులో ఉంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతున్నాయన్నారు.
ఒకటో తేదీన
ఎప్పుడైనా జీతం ఇచ్చావా..?
ఉద్యోగులుకు, పెన్షనర్స్కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చారా అని నిలదీశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఈ దశగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. పెన్షన్ కార్పొరేషన్ ఊసే లేదన్నారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్ లావణ్య పాల్గొన్నారు.


