భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన సేవలందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో 160 అర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 38 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, అధికారులు అందిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారం నాణ్యతతో ఉండి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యను లోతుగా అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. తమ గ్రామంలోని పాలకోడు మురికి కాలువ ఆనుకుని దాదాపుగా 50 ఏళ్లగా ఉంటున్నామని, తమకు ఎక్కడో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఉండి మండలం ఉణుదుర్రు గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లలేక ఇక్కడే ఉంటున్నామని తమ ఇళ్లు తొలగించాలని కుట్రలు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు.
మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలి
పిల్లల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చేలా మార్గనిర్దేశం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎనిమిదో పోషణ్ పక్వాడా– 2026 కార్యక్రమ అమలుపై అధికారులతో సమీక్షించారు.


