22న చేనేత గర్జన
పాలకొల్లు సెంట్రల్: చేనేత వృత్తి నేడు దారుణమైన కష్టాల్లో ఉందని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వీవర్స్ కాలనీలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో గత 78 ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఆ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేత రంగానికి కనీసం రూ.2000 కోట్లు కేటాయించాలని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక చేనేత సమస్యలపై ఈ నెల 22న చేనేత గర్జన నినాదంతో చలో మంగళగిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు సూచించారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి నేతన్న సర్కిల్ వరకూ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.


