అత్తిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని అత్తిలి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు విమర్శించారు. తమకున్న ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. గురువారం అత్తిలి ఎంపీపీ అభ్యర్థిని, అత్తిలి–1 ఎంపీటీసీ సభ్యురాలు రంభ సుజాత మాజీ మంత్రి కారుమూరి నివాసంలో తన సహచర ఎంపీటీసీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నా కూటమి నా యకులు అక్రమంగా ఎన్నికను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు వచ్చి తమకు రక్షణ కల్పించకుండా ఏమీ తెలియనట్టు వ్యవహరించారని వాపోయారు. కుటిల సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసిందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ దారం శిరీష మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా పార్టీపై ఉన్న అభిమానంతో తమ పార్టీ అభ్యర్థికి ఓటువేయడానికి వెళుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. లక్ష్మీనారాయణపురం ఎంపీటీసీ సభ్యుడు ఆడారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేంచేలా కూటమి శ్రేణులు దాడులు చేయడం హేయం అన్నారు. ఎంపీటీసీ సభ్యులు అద్దంకి శ్రీను, సుంకర నాగేశ్వరరావు, కూరాకుల లక్ష్మి, దొమ్మేటి రమ్య, నల్లమిల్లి నాగమణి, శరకడం రామలింగ విష్ణుమూర్తి, గుడిమెట్ల ధనలక్ష్మి, పురుషోత్తపు నాగేంద్ర శ్రీనివాస్, ముదునూరి దుర్గా భవాని తదితరులు మాట్లాడారు.