
చోరీ కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: ఆశా వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. చిన్నంవారిగూడెం గ్రామానికి చెందిన ఏలేటి రాణి అదే గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఈనెల 18న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా.. తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువా వెతకగా, బీరువాలో ఉంచిన 4 కాసుల బంగారం కనబడలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇంటి పక్కనే ఉన్న ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుతో పేర్కొన్నారని, ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కండక్టర్పై దాడి, కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు కండక్టర్పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కోనా ప్రసాద్ శనివారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం – తాడేపల్లిగూడెం సర్వీస్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కిన జల్లి ప్రవీణ్కుమార్ను టిక్కెట్ అడిగారు. కండక్టర్ టిక్కెట్కు సరిపడా చిల్లర ఇమ్మని ప్రవీణ్కుమార్కు సూచించారు. దీంతో ప్రవీణ్కుమార్ కండక్టర్ను దుర్భాషలాడుతూ క్యాష్బ్యాగ్ లాక్కొని, కొట్టడంతో పాటు, బస్సులోని రాడ్డుకు కండక్టర్ను కొట్టాడు. దీంతో కండక్టర్కు గాయాలయ్యాయి. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ నెల 14 నుంచి 16 వరకూ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
26న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్మేళా
కై కలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఆటపాక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత ఆదివారం చెప్పారు. జాబ్మేళాలో ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కై కలూరు నేషనల్ స్కూల్, నవతా రోడ్డు ట్రాన్స్పోర్టు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 160 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18–35 సంవత్సరాల వయస్సు కలిగిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9701357315, 6281119575 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చన్నారు.
నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
చింతలపూడి: నాగిరెడ్డిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చాట్రాయి మండలం కొత్తగూడెంకు చెందిన ముల్లంగి శ్రీనివాసరావు, ముల్లంగి రామేశ్వరం బైక్పై నాటుసారా రవాణా చేస్తుండగా 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.అశోక్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్వీఎల్ నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.