న్యూశాయంపేట: ప్రజావాణిలో అందించే దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ గణేశ్ అన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినతులు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 136 దరఖాస్తులు రాగా రెవెన్యూ 42, జీడబ్ల్యూఎంసీ 26, హౌసింగ్ 21, డీఆర్డీఓ 16, ఇతర శాఖలకు సంబంధించినవి 31 దరఖాస్తులు వచ్చాయన్నారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రెండు దరఖాస్తులు వచ్చాయి. డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● తన వాటాకు సంబంధించిన భూమిని అత్తామామ, మరిది కుమారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఖిలావరంగల్ మండలం వసంతా పూర్కు చెందిన కె.కవిత వినతిపత్రం అందించారు.
● వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి 37, 38 డివిజన్ పరిధి ఖిలావరంగల్ పడమర కోట ప్రాంతంలో తాగునీటి ఎద్దడిని నివారించాలని అఖిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు.
● ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని 16వ డివిజన్కు చెందిన గొర్రె అరుణ కోరారు.
● హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రెడ్డిపాలెం గ్రామానికి ఎనిమిది నెలల నుంచి గ్యాస్ సరఫరా కావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
అదనపు కలెక్టర్ వైవీ గణేశ్
ప్రజావాణికి 136,
రెవెన్యూ డివిజన్లో 2 దరఖాస్తులు


