● డీఐఈఓ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థుల హాజరును పకడ్బందీగా నమోదు చేసేందుకు నూతన ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఇంటర్ విద్యా కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు టీజీబీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ వినియోగంపై గూగుల్ మీట్ ద్వారా శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ముఖ గుర్తింపు రిజిస్ట్రేషన్, రోజువారీ హాజరు, ఆన్ డ్యూటీ నమోదు, ప్రిన్సిపాళ్ల మానిటరింగ్, రిపోర్టింగ్ తదితర ప్రక్రియలను యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త యాప్లో అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల హాజరు నమోదు మరింత వేగంగా, సులభంగా జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 200 మందికి పైగా సిబ్బంది, 2,400 మంది విద్యార్థులకు హాజరు విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ కేశవ్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


